
అబ్బాయి అమ్మాయిగా మారి ఓ వ్యక్తి నుంచి రూ.20లక్షలు కాజేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎస్.. అబ్బాయే అమ్మాయిగా హనీట్రాప్ చేసింది.. కాదు కాదు చేసాడు! యువతుల ఫోటోలతో ఎదుటివారిని నమ్మించి ట్రాప్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో బ్రౌజింగ్ చేస్తూ ఉన్నాడు. కావ్య, సంధ్యారాణి పేర్లతో ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చాయి. అందమైన యువతుల ఫోటోలు కూడా డిపిలో కనిపిస్తున్నాయి. దీంతో టెంప్ట్ అయిన ఆ వ్యక్తి.. ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశాడు. ఇక అంతే.. యువతిలా చాటింగ్ మొదలయ్యాయి. దీంతో స్నేహం పెరిగింది. ఇక ఆ వ్యక్తి బలహీనతలను క్యాష్ చేసుకోవడం కోసం.. ఎమోషనల్ గా మెసేజ్లు. ఇంతలో తనకు సమస్యలు ఉన్నాయని మెసేజ్లు రాగానే ఆ వ్యక్తి కరిగిపోయాడు. ఆ మెసేజ్ల ట్రాప్లో పడిపోయాడు. దీంతో దఫ దఫాలుగా.. లక్షలు సమర్పించుకున్నాడు. ఇంకా తరచూ డబ్బుల కోసమే.. అడుగుతూ ఉండడంతో నగదు ఆన్లైన్లో సెండ్ చేస్తూ ఉన్నాడు. ఎంతవరకు అంటే 20 లక్షలు సమర్పించుకునే దాకా ఆ పనికి జ్ఞానోదయం కాలేదు.
చివరకు తాను మోసపోయిన అని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు సదరు వ్యక్తి. కేసు నమోదు చేసిన పోలీసులు కూపి లాగారు. ఫేస్బుక్ లింక్స్ ఫోటోలు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ లింకు హైదరాబాద్కు తగలడంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. ఫేస్బుక్లో కనిపిస్తున్న ఆమెను పట్టుకునేందుకు వెళితే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉన్నది ఆమె కాదు.. అతడు! ఎస్.. ఇదంతా చేసింది సాంబశివరావు అనే ఓ యువకుడిని పోలీసులు కనిపెట్టారు. అతన్ని పట్టుకుని స్టేషన్కు తరలించారు.
నిందితుడు గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన అన్నపరెడ్డి సాంబశివరావుగా గుర్తించారు. అతను హైదరాబాద్ బోడుప్పల్లో నివాసం ఉంటూ ముకుందా కిచెన్స్లో హెల్పర్గా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల పాలైన సాంబ నేరాల బాటపట్టినట్టు గుర్తించారు. ఇలా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ను క్రియేట్ చేసి అందులో అందమైన అమ్మాయిలు, మహిళల ఫోటోలు పెట్టి.. యువకులను ట్రాప్ చేయడం ప్రారంభించాడని ఈ క్రమంలోనే విశాఖకు చెందిన ఓ వ్యక్తికి రిక్వెస్ట్లు పెట్టి అతడి నుంచి లక్షలు కాజేసినట్టు గుర్తించారు.
పోలీసుల సూచన
ఈ సోషల్ మీడియాలో మోసాల నేపథ్యంలో తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులపై నమ్మకం ఉంచి డబ్బులు పంపవద్దని.. వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వవద్దంటున్నారు. అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కొరకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in, లేదా టోల్ ఫ్రీ నెంబర్: 1930 లేదా శ్రీ కమిషనర్ ఆఫ్ పోలీస్: 7995095799 వారికి కాల్ చేసి ఫిర్యాదు చేయగలరని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.