
రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేసుకుంటూ వస్తోన్న ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా మండల కేంద్రంలోని హైస్కూళ్లను ఇంటర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. దీనిపై గత వారంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
పదో తరగతి పాసైన చాలా మంది ఇంటర్ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదన్న అంశం వారి సమావేశంలో చర్చకు వచ్చింది. దూరభారం వల్లే ఈ సమస్య వస్తోందని ఆ సమావేశంలో వారు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మండల స్థాయిలోనే ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అడ్మిషన్లను గణనీయంగా పెంచొచ్చని ఉన్నాతాధికారులు భావించారు. ఇదే విషయంపై సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ఉన్న హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయనున్నారు.