AP Rains: ఏపీకి రెడ్ అలెర్ట్.. మరో 24 గంటలు భారీ వర్షం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

|

Sep 01, 2024 | 2:38 PM

రెండు రోజులుగా కురిస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ విపత్తుల నిర్వాహణ శాఖ కార్యాలయం నుంచి కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు హోంమంత్రి అనిత. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తూ, సహాయక చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అధికారులంతా అందుబాటులో ఉండి, బాధితులకు వెంటనే సాయం అందించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.

AP Rains: ఏపీకి రెడ్ అలెర్ట్.. మరో 24 గంటలు భారీ వర్షం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Andhra Weather Report
Follow us on

ఏపీకి వానల ముప్పు వీడలేదు. మరో 24 గంటలు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది.  ఇప్పటికే వాగులు, వంకలు తెగి ప్రవహిస్తున్నందున.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.

బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని సింగ్‌నగర్‌కాలనీని వరద నీరు ముంచెత్తింది. కాలనీ మొత్తం నడుం లోతు నీటితో మునిగిపోయింది. దీంతో వరద బాధిత ప్రాంతాలను లైఫ్‌ జాకెట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలకు బెజవాడ అతలాకుతలం అవుతోంది. ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది.  బుడమేరు ఉధృతికి విజయవాడ నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుందిబుడమేరు వరద ముంచెత్తడంతో సింగ్‌నగర్‌, అంబాపురం, వైఎస్సార్ కాలనీ, రాజీవ్‌నగర్‌, జక్కంపూడి, అజిత్‌సింగ్‌నగర్‌, కండ్రిగ, న్యూరాజరాజేశ్వరిపేట, సుందరయ్యనగర్‌లు నీటమునిగాయ్‌. అనేక కాలనీల్లో ఐదు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆహారం, మంచినీళ్లు లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.

భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్‌ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికార యంత్రాగాన్ని సీఎం ఆదేశించారు. బుడమేరు వరదే ముంపునకు కారణమని CM దృష్టికి తెచ్చారు మంత్రి నారాయణ. వరదలపై ఇరిగేషన్‌ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడాలని సీఎం ఆయనకు సూచించారు.  వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలన్నీరు  చంద్రబాబు. దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని మదింపు చేయాలన్నారు. నష్టాన్ని అంచనావేసి కేంద్రప్రభుత్వానికి పంపాలని CM సూచించారు. రైతులకు, రైతు కుటుంబాలకు వెంటనే సాయం అందించాలన్నారు. ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకూడదున్నారు. అధికారులు బాధ్యతలు నిర్వర్తించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేలతో కలసి మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక చర్యలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టామన్నారు ఏపీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ జయలక్ష్మి. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో హైఅలెర్ట్‌ కొనసాగుతుందని చెప్పారు. అలాగే.. బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంత గ్రామాలు రెడ్‌ అలెర్ట్‌లో ఉన్నాయని తెలిపారు. ఇక.. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరు SDRF, NDRF టీమ్‌లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు జయలక్ష్మి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.