Bhadrachalam: మళ్లీ భయపెడుతోన్న గోదావరి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక.. బిక్కుబిక్కుమంటున్న ముంపువాసులు

గత నెలలో కురిసిన భారీ వర్షాలు, గోదావరికి (Godavari) పోటెత్తిన వరదలను మరిచిపోకముందే మరోసారి వరద పోటెత్తుతోంది. భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. అధికారులు అప్రమత్తమై...

Bhadrachalam: మళ్లీ భయపెడుతోన్న గోదావరి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక.. బిక్కుబిక్కుమంటున్న ముంపువాసులు
Bhadrachalam

Updated on: Aug 10, 2022 | 6:43 AM

గత నెలలో కురిసిన భారీ వర్షాలు, గోదావరికి (Godavari) పోటెత్తిన వరదలను మరిచిపోకముందే మరోసారి వరద పోటెత్తుతోంది. భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. అధికారులు అప్రమత్తమై మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారుర. గోదావరి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, ఉపనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నదిలో ప్రవాహం ప్రమాదకర స్థాయిని మించి కొనసాగుతోంది. గోదావరి వరద కారణంగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో నీరు చేరింది. రహదారులు నీట మునిగాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో వచ్చిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంపువాసులకు తాజాగా మరోసారి వరద ముంపు పొంచి ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో తెలంగాణ నుంచి విలీనమైన మండలాలకు వరద వణికిస్తోంది. గోదావరి, శబరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. అయితే వరద ప్రమాదంపై అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేదని ముంపుబాధితులు ఆవేదన చేస్తున్నారు.

మంగళవారం సాయంత్రానికి కూనవరంలో గోదావరి నీటి మట్టం 42 అడుగులు దాటింది. చింతూరు-వరరామచంద్రాపురం ప్రధాన రహదారిపై వరద చేరింది. ఎటపాక మండలం గుండాల, రాయనపేట, కొల్లుగూడెం తదితర మురుమూరు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు.. దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. పోశమ్మగండి వద్ద గండిపోశమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. వరదల కారణంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు చింతూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

కాగా.. గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని మంచిర్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని సాగర సమంగమం వరకు అన్ని ఉద్ధృతంగా ప్రవహించింది. పరివాహక ప్రాంతాలను ముంచేస్తూ భయాందోళనలు రేకెత్తించింది. భధ్రాచలం పట్టణం నీట మునిగింది. గోదావరి నీటిమట్టం ఒకానొక దశలో 70 అడుగులు దాటింది. గత 36 ఏళ్లల్లో తొలిసారిగా భద్రాచలం వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఏపీ లోని ధవళేశ్వరం, రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. లంక గ్రామాలను ముంచెత్తింది. అయితే.. ఇప్పుడిప్పుడే వరద తగ్గుతుందనుకుంటున్న సమయంలో మరోసారి వరద ముప్పు పొంచి ఉండటం బాధితులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us