
వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు.. పెద్దవాడు ఇంటర్మీడియట్.. మిగిలిన ఇద్దరూ తొమ్మిది, ఐదో తరగతి చదువుతున్నారు. చిన్నన్న దగ్గర ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ ముగ్గురు అదృశ్యం అయ్యారు. ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో తెలియదు. దీంతో ఆ బాలలను సంరక్షిస్తున్న చిన్నాన్నలో ఆందోళన మొదలైంది. పోలీసులను ఆశ్రయించేసరికి రంగంలోకి ప్రత్యేక బృందాలు దిగాయి. విశాఖ గాజువాకలో ఈ ఘటన జరిగింది.
పాత గాజువాక కైలాస నగర్ కు చెందిన.. రాఘవేంద్రరావు అశ్వని దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రెండో కొడుకు నైన్త్ క్లాస్.. చిన్న కొడుకు ఐదో తరగతి. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు దూరమయ్యారు. భర్త చెప్పకుండా ఎక్కడికో ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. భార్య అశ్విని తన స్వగ్రామం మహారాష్ట్రలోని సోలాపూర్ పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో ముగ్గురు పిల్లలు తన చిన్నాన్న దగ్గర గాజువాకలో ఉంటున్నారు. సోమలింగ ఆ ముగ్గురు పిల్లలను చదివిస్తూ ఉన్నాడు. రెండు రోజుల క్రితం.. ఏమైందో ఏమో కానీ ఈ ముగ్గురు పిల్లలు ఒక్కసారి కనిపించలేదు. వారి వస్త్రాలు ఆధార కార్డులు సర్టిఫికెట్లు కూడా లేవు. దీంతో చిన్నాన్న సోమలింగ అంతా వెతికాడు. కనిపించిన వారందరికీ అడిగాడు. పిల్లల కోసం ఆరా తీశాడు. ఫలితం లేకపోయేసరికి గాజువాక పోలీసులను ఆశ్రయించాడు. కాల్ డేటా తో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు పోలీసులు. ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు.
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే 20 రోజుల క్రితం పిల్లల మేనమామ అక్షయ విశాఖ వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ‘ ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లలు ముగ్గురు తిరిగి రాలేదు. చిన్నాన్న ఫిర్యాదు చేశారు. 20 రోజుల క్రితం విశాఖ వచ్చిన పిల్లల మామయ్య వారికి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఆ తర్వాత అతనితోనే టచ్ లో ఉన్నట్టు మా విచారణలో తేలింది. పిల్లల సర్టిఫికెట్లు కూడా మొబైల్ ద్వారా మామయ్యకి పంపినట్టు గుర్తించాము. దీన్నిబట్టి.. వారితోనే పిల్లలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నాం. త్వరలోనే కేసును చేదిస్తాం.’ అని అన్నారు గాజువాక సీఐ వాసు నాయుడు.