Guntur: బ్యాంక్‌లో భారీ మోసం.. సీఐడీ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం..

| Edited By: Velpula Bharath Rao

Oct 09, 2024 | 8:28 PM

ఇల్లు అమ్మి ఫిక్స్‌డ్ డిపాజిట్ వేసిన వాళ్లు కొంతమంది, కొడుకులు పంపించిన డబ్బులు దాచుకున్న వారు మరికొందరు, బంగారం తనఖా పెట్టి రుణం తెచ్చుకున్న వారు ఇంకొంతమంది.. వ్యాపారం కోసం ఓడీలకు వెళ్లిన వారు మరి కొంతమంది.. వీరందరినీ మోసం చేసింది మాత్రం ఇద్దరూ ఉద్యోగులు..

Guntur: బ్యాంక్‌లో భారీ మోసం.. సీఐడీ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం..
Bank Fraud
Follow us on

ఇల్లు అమ్మి ఫిక్స్‌డ్ డిపాజిట్ వేసిన వాళ్లు కొంతమంది, కొడుకులు పంపించిన డబ్బులు దాచుకున్న వారు మరికొందరు, బంగారం తనఖా పెట్టి రుణం తెచ్చుకున్న వారు ఇంకొంతమంది.. వ్యాపారం కోసం ఓడీలకు వెళ్లిన వారు మరి కొంతమంది.. వీరందరినీ మోసం చేసింది మాత్రం ఇద్దరూ ఉద్యోగులు.. ఇప్పటి వరకూ రెండు బ్రాంచ్‌ల్లో మోసం చేసిన వారు దొరికిపోయారు. చివరకు వారు చేసిన పాపాల పుట్ట పగిలిపోయింది. దీంతో ప్రభుత్వం పూర్థి స్థాయి దర్యాప్తు కోసం సీఐడీకి కేసును అప్పగించింది.

అతని పేరు నరేష్ ఐసీఐసీఐ చిలకలూరిపేట బ్రాంచ్ మేనేజర్.. మరొక అతను పేరు హరీష్ బ్యాంక్‌లో అప్రైజర్‌గా పనిచేస్తాడు. ఇద్దరూ కలిసి చేతులు కలిపారు. ఇంకేముంది తమకిష్టమొచ్చినట్లు మోసాలకు పాల్పడ్డారు. యడ్లపాడుకు చెందిన ఓ మహిళ తన ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులను చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది. అయితే కొద్దీ రోజుల తర్వాత ఆమె బ్యాంక్‌కు వచ్చి ఆరా తీయగా ఆమె డిపాజిటే లేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె కంగుతింది. మరికొంత మంది తాము తీసుకున్న రుణం కంటే తమ పేరుపై అధిక రుణం ఉన్నట్లు గుర్తించారు.

అదే విధంగా బంగారు ఆభరణాలు తనఖా పెట్టి తెచ్చుకున్న రుణం కంటే అధిక రుణం తమ పేరు మీద ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఒక్కొక్కరుగా బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. అయితే బ్యాంక్ సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు. దీంతో వీరంతా వెళ్లి చిలకలూరిపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మోసాలన్నింటికి కారణం మేనేజర్ నరేష్, బ్యాంక్ అప్రైజర్‌గా పనిచేస్తున్న హరీషే అని బాధితులు వాపోయారు.

ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఇదే తరహా మోసాలు నర్సరావుపేట బ్రాంచ్‌లోనూ బయటపడ్డాయి. ఆయిల్ వ్యాపారులు ఓడీ తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. అయితే తమకున్న లిమిట్ కంటే అధిక మొత్తంలో పెంచి దానిలో కొంత భాగాన్ని ఇతరులకు నగదు ఇచ్చినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఐదుగురు వ్యాపారులు బ్యాంక్‌కు వెళ్లి నిలదీయగా అప్పటి మేనేజర్ నరేష్, అప్రైజర్ హరీష్ పాత్ర ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా మరికొంత మంది డిపాజిట్లలో కూడా తేడా ఉన్నట్లు తేల్చారు. దీంతో బ్యాంక్ ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది.

ఖాతాదారుల ఆందోళన నేపధ్యంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బ్యాంక్‌కు వెళ్లి ఖాతాదారులతో మాట్లాడారు. అదే సమయంలో సీఐడీ డీజీ రవిశంకర్‌‌తో కూడా ఫోన్లో మాట్లాడారు. దీనిపై సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని నరేష్, హరీష్‌పై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసిందని ఆయన తెలిపారు. వారిద్దరిపైనే కాకుండా ఇందులో ఉన్న సిబ్బంది అందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పుల్లారావు డిమాండ్ చేశారు. అయితే ఖాతాదారులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నష్టపోయిన వారికి న్యాయం చేస్తామన్నారు.