TDP-Janasena-BJP: ఏపీలో కూటమిలో రెబల్స్ భయం.. పలు చోట్ల పోటీకి సిద్ధం అవుతున్న నేతలు!
కూటమిలో ట్రబుల్స్ కొనసాగుతున్నాయి. నాలుగు స్థానాల్లో గొడవలు ఇంకా చల్లారలేదు. మరోవైపు కూటమి పార్టీలను రెబల్స్ గుబుల్ వెంటాడుతోంది. కావలిలో టీడీపీ రెబల్, గన్నవరంలో బీజేపీ రెబల్.. ఆయా పార్టీల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ఇక బీజేపీలో కూడా అనపర్తి టపాసులు పేలుతున్నాయి.
కూటమిలో ట్రబుల్స్ కొనసాగుతున్నాయి. నాలుగు స్థానాల్లో గొడవలు ఇంకా చల్లారలేదు. మరోవైపు కూటమి పార్టీలను రెబల్స్ గుబుల్ వెంటాడుతోంది. కావలిలో టీడీపీ రెబల్, గన్నవరంలో బీజేపీ రెబల్.. ఆయా పార్టీల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ఇక బీజేపీలో కూడా అనపర్తి టపాసులు పేలుతున్నాయి. టీడీపీ నుంచి నేతను దిగుమతి చేసుకుని అభ్యర్థిగా నిలబెడితే… కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినదా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక చిత్తూరులో శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలోకి వెళ్లనుండడం.. టీడీపీని దెబ్బ తీస్తుందంటున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇంకా చిచ్చు రగులుతూనే ఉంది. అటు రెబల్స్ బెడదతో పాటు ఇటు సీట్ల పంచాయితీ ఇంకా కాక రేపుతూనే ఉంది. ఇక నెల్లూరు జిల్లా కావలిలో రెబల్ అభ్యర్థి, టీడీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ తనకు టికెట్ ఇస్తానని చెప్పి చివరి నిమిషంలో మోసం చేసిందని మండిపడ్డారు టీడీపీ రెబల్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్. కావలి నియోజకవర్గంలో తనకు ప్రజల మద్దతు ఉందన్నారు. అందుకే భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశానన్నారు పసుపులేటి.
బీజేపీలో అనపర్తి చిచ్చు.. నల్లమిల్లి చేరికపై నేతల అభ్యంతరాలు
మరోవైపు ఏపీ బీజేపీలో అనపర్తి చిచ్చు రాజుకుంది. టీడీపీ నేత నల్లమిల్లిని చేర్చుకోవాలనే నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేత బీజేపీ తరపున పోటీచేస్తే, కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోతారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు చెప్పారని నల్లమిల్లికి బీజేపీ టికెట్ ఇస్తే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతామంటూ పోస్టులు పెడుతున్నారు కాషాయ నేతలు. ఈ అంశంలో ఏపీ బీజేపీ నాయకత్వాన్ని కూడా ఐవైఆర్ కృష్ణారావు, లక్ష్మీపతి రాజా ప్రశ్నించారు. ఇలాగైతే రాష్ట్రంలో బీజేపీ ఉనికే ప్రశ్నార్ధకమవుతుందని లక్ష్మీపతిరాజా అంటే, ఏపీ బీజేపీ దశ దిశ లేకుండా సాగుతోందన్నారు ఐవైఆర్..
చిత్తూరులో టీడీపీకి భారీ షాక్..వైసీపీలో చేరనున్న శ్రీనాథ్రెడ్డి దంపతులు
ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి అమర్ నాథ్ సోదరుడు శ్రీనాథ్ రెడ్డి, అనీషా రెడ్డి..ఈ నెల 25న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 2019 ఎన్నికల్లో పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు అనీషారెడ్డి. మదనపల్లిలో శ్రీనాథ్రెడ్డి దంపతులతో పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి సమావేశమయ్యారు. శ్రీనాథ్రెడ్డి దంపతుల రాకతో పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో టీడీపీపై ప్రతికూల ప్రభావం పడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
గన్నవరంలో బీజేపీ రెబల్ నామినేషన్
ఇక టీడీపీ పోటీ చేస్తున్న గన్నవరంలో బీజేపీ రెబల్ అభ్యర్థిగా కొర్రపోలు శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి అని చెప్పి బీజేపీ నేతలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకనే తాను గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానన్నారు. టీడీపీ నేతలు పొత్తు ధర్మాన్ని పాటించట్లేదని, బీజేపీ నేతలను కలుపుకుని వెళ్లట్లేదని కొర్రపోలు ఆరోపించారు.
టీడీపీ కార్యాలయానికి నిప్పు
మరోవైపు పెదకూరపాడు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాల దహన కార్యక్రమం యథేచ్ఛగా జరుగుతోంది. బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు గుర్తుతెలియని దుండగులు. ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ సమాచారం ఇవ్వడంతో స్థానికులు… మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అంతకుముందు క్రోసూరులోని టీడీపీ కార్యాలయానికి ఆగంతకులు నిప్పు పెట్టారు. అంతకంటే ముందు ధరణికోటలోని వైసీపీ ఆఫీసును దగ్ధం చేశారు దుండగులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..