
Onion, Palm Oil Prices: గల్ఫ్ యుద్ధం, ఎల్నినో ప్రభావాన్ని సాకుగా చూపుతూ కొందరు దళారీలు, స్వార్థపరులు నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారన్న అభిప్రాయం ప్రభుత్వానికి వ్యక్తమైంది. ధరల పెరుగుదల వెనుక కారణాలను గుర్తించి, ప్రభుత్వ జోక్యంతో సామాన్యుడిపై భారం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి పర్యావ కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు లతో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ నిత్యవసర ధరల నియంత్రణపై దృష్టి సారించింది.
నిత్యావసరాల్లో కీలకమైన ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుని నాణ్యమైన ఉల్లిపాయలను తక్కువ ధరకే అందించనున్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిని రూ.35కే విక్రయించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
పామాయిల్ ధరలను కూడా తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే కనీసం రూ.10 తక్కువకు పామాయిల్ అందించేలా సంబంధిత కంపెనీలతో చర్చించి రెండు రోజుల్లో చర్యలు తీసుకోనున్నారు.
ఇప్పటికే ఏర్పాటు చేసిన రైస్ కౌంటర్ల ద్వారా మార్కెట్ ధర కంటే రూ.10 నుంచి రూ.12 తక్కువకే బియ్యం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్ల సంఖ్యను పెంచి తక్కువ ధరకే బియ్యం అందించేలా చర్యలు కొనసాగనున్నాయి.
కందిపప్పు ధరల నియంత్రణపైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. రానున్న రోజుల్లో ధరల పెరుగుదలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయం.
నిత్యావసర ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్షించనున్నారు. ధరల పెరుగుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ జోక్యాన్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారనీ పౌరసరఫరస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టీవీ9 కి తెలిపారు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి