
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. యెర్నగూడెం సమీపంలో ఎన్హెచ్-16 వద్ద అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన 21 కిలోల గంజాయితో పాటు రెండు బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
జాతీయ రహదారి పక్కనున్న పాత బ్రాందీ షాపు వద్ద మోటారు సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్నట్లు దేవరపల్లి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎస్సై పి. మనోహర్ తన సిబ్బందితో కలిసి మధ్యవర్తుల సమక్షంలో అక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమ రవాణా గుట్టురట్టయింది. అరెస్టయిన వారిలో పెదపారుపూడి మండలం కొర్నిపాడుకు చెందిన మోచర్ల హేమంత్ కుమార్ అలియాస్ చిన్ను (20) , పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన చామనపూడి శరణ్ దాస్ అలియాస్ చరణ్ (28) లు ఉన్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆగస్టు 31న యెర్నగూడెం పరిసరాల్లో హైవే మొబైల్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసి పరారైన దుండగులు వీరిద్దరేనని పోలీసులు గుర్తించారు. ఈ కేసుపై దేవరపల్లి సీఐ నాగేశ్వర నాయక్ నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. పట్టుబడిన నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.