ఆక్సిజన్ లేక తల్లికి నోటితో ఊపిరూదిన కూతురు..యూపీలో మరో హృదయవిదారక ఘటన
దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న మారణహోమం కొనసాగుతోంది. ప్రాణవాయవు కోసం దేశవ్యాప్తంగా చాలా మంది రోగులు తల్లడిల్లిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ అందక రోగులు...

దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న మారణహోమం కొనసాగుతోంది. ప్రాణవాయవు కోసం దేశవ్యాప్తంగా చాలా మంది రోగులు తల్లడిల్లిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేసింది.
ఉత్తరప్రదేశ్లోని భైరాచి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ బారినపడి ఊపిరాడక అల్లాడిపోతున్న ఓ తల్లిని కాపాడుకునేందుకు కూతుర్లు పడ్డ కష్టం అక్కడి వారందరినీ కలచివేసింది. కరోనా సోకిన ఓ మహిళను ఆమె ఇద్దరు కూతుళ్లు కలిసి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వచ్చి చికిత్స అందించే లోపే ఆ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. శ్వాస ఆడక.. ఆమె ప్రాణాపాయ స్థితిలోకి జారింది. తమ తల్లిని కాపాడుకోవడం కోసం..ఆ కూతురు తన నోటితో శ్వాస అందిస్తూ అమ్మను బ్రతికించుకునే ప్రయత్నం చేసింది. అది చూసిన ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు చలించిపోయారు.
ఉత్తరప్రదేశ్లో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. ఓ భార్య తన భర్తకు నోటిలో నోరు పెట్టి శ్వాసను అందించే ఘటన చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్ అనే మహిళ.. కరోనా సోకిన తన భర్త రవి సింఘాల్ను కాపాడుకోవడానికి విఫలయత్నం చేసింది. భర్తకు ఏమవుతుందోననే భయం..ఆందోళనతో అతడిని ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో ఎవ్వరూ చేయని సాహసం చేసింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్త నోటిలో నోరు పెట్టి శ్వాస నందించింది. తన భర్తను కాపాడుకోవటానికి తనకు కరోనా సోకినా ఫరవాలేదు. తన ప్రాణాలు పోయినా ఫరవాలేదనుకుంది. అంతే ఏమాత్రం ఆలోచించకుండా తన నోటితో భర్తకు శ్వాస అందించింది. కానీ ఫలితం దక్కలేదు. భర్త ప్రాణాలు నిలవలేదు. కరోనా కాటుకు ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు.
