Weather Report: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఎండ తీవ్రతతో అవస్థలు పడుతున్న ప్రజలకు ఉపశమనం అందించింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందింది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ కూల్ న్యూస్ అందించింది. రాబోయే రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది. గురువారం వరకు ఉరుములు, మెరపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. హైదరాబాద్లో రాత్రి వర్షం బీభత్సం సృష్టించగా.. నేడు కూడా వాతావరణశాఖ వర్ష సూచన జారీ చేసింది. ఇక తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగనున్నాయి.
ఆరెంజ్ అలర్ట్
ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు కురుస్తుండగా.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో రాబోయే రెండ్రోజుల పాటు ఆకస్మిక వర్షాలకు అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని, వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వద్ద నిల్చోవద్దని సూచించింది. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అయితే మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడ్డాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇక కాకినాడ, అనకాపల్లి, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, మార్కాపురం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి.
వాతావరణశాఖ హెచ్చరికలు ఇవే..
వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు వర్షాలతో పాటు రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. బుధవరాం 68 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 93 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. నేడు ఉభయ గోదావరి జల్లాలతో పాటు కోనసీమ, ఏలూరు, కృష్ణ, బాపట్ల, అనకాపల్లి జిల్లాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.
