
ఎక్కడో పొదలు, పొలాల్లో సంచరించే పాములు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లలో కాదు ఏకంగా రైల్వేస్టేషన్ లు, ఎయిర్పోర్టులో కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ లో హడలెత్తించిన పాముల ఘటన మరువక ముందే విశాఖలోని అటువంటి పరిస్థితే ఎదురైంది. విశాఖ ఎయిర్పోర్టులో భారీ నాగుపాము కలకలం రేపింది. జనరేటర్ రూమ్లో తిష్ట వేసిన ఐదు అడుగుల నాగుపాము హల్చల్ చేసింది. టర్మినల్ మేనేజర్ రూమ్కు ఆనుకొని ఉంది జనరేటర్ రూమ్. పామును చూసిన ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ కేచర్ కు సమాచారం అందించారు ఎయిర్పోర్ట్ స్టాఫ్. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కిరణ్.. చాకచక్యంగా పామును రెస్క్యూ చేసారు.
విశాఖ రైల్వే స్టేషన్ లోనూ నాగుపాము హల్చల్ చేసింది. ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ వెలుపల ఉన్న సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం వద్ద నాగు పాము కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన రైల్వే సిబ్బంది.. స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. అత్యంత చేత చక్యంగా స్నేక్ కేచర కిరణ్ ఆ నాగుపామును రెస్క్యూ చేశారు.
కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో దగ్గరలో ఉన్న తుప్పలు, పుట్టల్లోంచి పాములు బయటకు వచ్చి ఉంటాయని స్నేక్ క్యాచర్లు భావిస్తున్నారు. పాములను చూసిన వాళ్ళు కేకలు వేయడంతో తెలుసుకొని కొన్నింటిని స్నేక్ క్యాచర్ల సాయంతో పట్టుకుంటున్నారు. స్టేషన్, ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో కొన్నిచోట్ల ఆహారం వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయని అంటున్నారు. అయితే ప్రయాణికులు ఉండే ప్రాంతంలో పాముల అలజడి లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.