
అమరావతిలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల విల్లాల నిర్మాణాలు పూర్తయ్యాయి. తాజగా సీఎం చంద్రబాబు నివాస నిర్మాణం కూడా పూర్తైంది. గత ఏడాది ఏప్రిల్ 9న శంకుస్థాపన చేసిన ఈ నివాసం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. మరికొన్ని నెలల్లోనే గృహప్రవేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది కేవలం ఒక ఇంటి నిర్మాణం మాత్రమే కాదు అధికార, ప్రజా కార్యక్రమాలకు కేంద్రంగా నిలిచే ప్రజా భవన్ కూడా ఇక్కడే రూపుదిద్దుకుంటోంది.
సుమారు 25 వేల చదరపు గజాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్ట్లో పచ్చదనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అత్యాధునిక సాంకేతికత, కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మంత్రి లోకేష్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ వేగం పెంచుతున్నారు. ఇక మౌలిక వసతుల విషయానికి వస్తే E6 ప్రధాన రహదారి ఈ ప్రాంతానికి నూతన ఊపిరి పోస్తోంది. ఒకప్పుడు కురువలు పట్టిన ఈ నేల ఇప్పుడు సిమెంట్ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఐసిటి కేబుల్స్, గ్యాస్ పైప్లైన్లతో స్మార్ట్ ఇన్ఫ్రా హబ్గా మారింది.
స్థానిక రైతులు కూడా ఈ మార్పుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా భూముల కొనుగోలు జరగడం, తమ ప్రాంతం అభివృద్ధి చెందడం గర్వకారణమని చెబుతున్నారు. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్థాయి వైపు దూసుకెళ్తోందని స్థానికులు అంటున్నారు. అమరావతి కేవలం ఒక రాజధాని మాత్రమే కాదని.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది అని ప్రజలు విశ్వసిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.