Andhra Pradesh: ఎక్కడికక్కడే సమస్యకు పరిష్కారం.. నేటి నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం

| Edited By: Balaraju Goud

Jun 24, 2024 | 9:04 AM

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పాలన సాగించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న త్వరితగతిన పరిష్కరించేలా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు నేతలు.

Andhra Pradesh: ఎక్కడికక్కడే సమస్యకు పరిష్కారం.. నేటి నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం
Public Grievance Redressal System
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పాలన సాగించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న త్వరితగతిన పరిష్కరించేలా అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు నేతలు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో మెజారిటీ ఇచ్చి తమను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండి ఆమోదయోగ్యమైన పరిపాలన చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది కూటమి సర్కార్. గత ప్రభుత్వంలో స్పందన పేరుతో ఉన్న ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా కొత్త వ్యవస్థ అమల్లోకి రానుంది.

అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల,జిల్లా స్థాయి కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు పలు ఇతర కార్యాలయాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉండనున్నారు. ప్రజలు నేరుగా ఆయా కార్యాలయాలకు వచ్చి తమ ఫిర్యాదులను అధికారులకు అందజేయవచ్చు. అంతేకాకుండా మీకోసం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదులు పంపవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఆయా ఫిర్యాదులకు సంబంధించి నిర్దేశిత గడువులోగా అధికారుల నుంచి తిరిగి సమాచారం పంపించనున్నారు. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే విధంగా కూడా అధికారులు అంతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి వారి నుంచి ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పదేపదే తిరగకుండా వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రభుత్వం సూచించింది. ఇకపై ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..