
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అత్యధికంగా కేంద్ర నిధులు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రెండో విడత నిధులు, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు కేంద్ర సహకారం, విశాఖ రైల్వే జోన్కు నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, జాతీయ రహదారుల వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
అమరావతికి చట్టబద్ధతపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అమరావతిపై కన్ఫ్యూజన్ ఉండకూడదన్నదే తమ విధానమన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెరగడానికి, నిర్మాణాల వేగం పుంజుకోవడానికి ఇది ఎంతో కీలకమన్నారు.
ఇక పోలవరం ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వాలంటే.. నల్లమలసాగర్ను చేపట్టాల్సి ఉందన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ ప్రాజెక్ట్కు కావాల్సిన నిధులపై సమావేశాల్లో మాట్లాడతామన్నారు.
వీటితో పాటు పార్టీ అధినేత చంద్రబాబు సూచించిన అనేక అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు టీడీపీ ఎంపీలు. రాయలసీమకు జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..