
ఎల్నినో కారణంగా ప్రత్యేక వాతావరణ పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో పంటల సాగు విధానంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే బుధవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినోను ఎదుర్కొనేలా పంటల సాగు జరగాలని సీఎం అన్నారు. పంటల మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, వాణిజ్య, ఉద్యాన పంటల సాగుపై రైతులకు సూచనలు ఇవ్వాలని సీఎం నిర్దేశించారు.
రాష్ట్రంలోని రైతులు పెద్దఎత్తున ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సర్టిఫికేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని.. ఈ విషయాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. రైతులను చైతన్య పరిచే కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో పంటలు సాగును తెలియచేయాల్సి ఉందని స్పష్టం చేశారు. మిర్చి, పొగాకు, తోతాపురి మామిడి ఉత్పత్తులకు సంబంధించిన అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
పొగాకు కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గిట్టుబాటు ధర వచ్చే వరకూ నిల్వ చేసుకునే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పప్పు దినుసులు సాగు చేసేందుకు వీలుగా ప్రణాళికలు చేయాలని.. తద్వారా రైతులకు ప్రయోజనం కలిగించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. మార్కెట్లో ఉన్న ఉత్పత్తులతో పాటు ప్రస్తుతం సాగు దశలో ఉన్న పంటల్ని కూడా ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు.
వ్యవసాయం, ఉద్యాన పంటల విషయంలో అదనపు విలువ జోడించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆక్వా రైతులు, అసోసియేషన్లతో పాటు ఆక్వా ఫీడ్ తయారీదారులతోనూ సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కష్ట కాలంలో ఉన్న రైతులను ఆదుకోవటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.