
రాష్ట్రంలో అతిపెద్ద సుగంధ ద్రవ్యాల తయారీ ప్లాంట్ ను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల తయారీ ప్లాంట్కి ఆంధ్రప్రదేశ్ నెలవుగా మారిందన్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ ను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా వేలాది మంది రైతులకు మేలు జరగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. దాదాపు రూ. 200 కోట్ల పెట్టుబడితో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల మిర్చితో పాటు మరో 15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఇక్కడ నుంచి ఎగుమతి చేసేలా ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఐటీసీ స్పైస్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం జగన్ చెప్పారు. మూడు సంవత్సరాల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో నిలుస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఇటువంటి పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇప్పటికే కార్యాచరణ చేసినట్లు వివరించారు.
13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ప్రతి జిల్లాలో రైతులు పండించే పంటలన్నింటికీ మెరుగైన ధర రావాలి. 26 పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రూ. 3,450 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీనివల్ల ప్రతి జిల్లాలో ఉన్న రైతులకు మేలు కలగడమే కాకుండా దాదాపు 33 వేల ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం.ఫేజ్ –1 లో10 యూనిట్లకు రూ. 1,250 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేసే కార్యక్రమాలకు డిసెంబరు, జనవరిలో శంకుస్ధాపన చేస్తాం. ఇవన్నీ పూర్తయితే రాబోయే రెండు మూడేళ్లలో మొత్తం 26 అందుబాటులోకి వస్తాయి.
– వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉందని ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పూరి చెప్పారు. ప్లాంట్ తొలిదశ పూర్తయిందన్న ఆయన.. రెండో దశ పనులు మరో 15 నెలల్లో పూర్తవుతుందన్నారు. ఈ ప్లాంట్ సమీప ప్రాంతాల్లోని 14 వేల మంది రైతులకు వరంగా మారుతుందని వివరించారు. నవంబరు 2020లో ఈ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారన్న ఆయన.. కేవలం 24 నెలల కాలంలోనే నిర్మాణం పూర్తై అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంత ఉందనేది అర్థమవుతోందని కొనియాడారు.
Global Spices Park
ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కన్నా అభివృద్దిలో ముందు వరసలో ఉందని మంత్రి విడదల రజినీ చెప్పారు. గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఈ ప్రాంతానికి స్పైసెస్ పార్క్ రావడానికి కేంద్రాన్ని ఒప్పించిన ఘటన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని పేర్కొన్నారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే అగ్రగామిలో ఉన్నామన్న రజినీ.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ ముందు వరసలో ఉన్నామని పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం