ఆంధ్రప్రదేశ్ పాలనలో ప్రక్షాళన ప్రారంభమైంది. జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బాధ్యతలు స్వీకరించడానికి ముందే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు సచివాలయంలోని అధికారుల్లో చర్చగా మారాయి. ఈసారి పాలనలో తనదైన మార్క్ చూపించలనుకుంటున్న చంద్రబాబు.. ఆ మేరకు మార్పుల పర్వం మొదలు పెట్టారు. కీలక అధికారుల విషయంలో ప్రక్షాళన చేపట్టారు. అయితే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఆలిండియా సర్వీస్ అధికారుల్లో దడ పుట్టిస్తున్నాయి. గత ప్రభుత్వ ఒత్తిడితో నిర్ణయాలు తీసుకున్న అధికారులకు కష్టాలు తప్పేలా కనబడటం లేదు.
జగన్ పాలనలో కీలకంగా వ్యవహరించిన జవహర్రెడ్డి.. ఇప్పటికే సెలవులపై వెళ్లిపోయారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే ఆయన సెలవుపై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. జవహర్రెడ్డి వ్యవహార శైలిపై మొదటి నుంచీ తీవ్ర అసంతృప్తిగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జవహర్రెడ్డి వ్యవహరించిన తీరుపై ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు అనేక సార్లు ఫిర్యాదులు చేశారు టీడీపీ నేతలు. అధికార వైసీపీకి సీఎస్ అండగా ఉంటున్నారని, ఆయనను వెంటనే బదిలీ చేయాలని కోరారు. కిందిస్థాయి అధికారులను ప్రభావితం చేసేలా సీఎస్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేతలు. అయితే ఎన్నికల నేపథ్యంలో పలువురు కీలక అధికారులను బదిలీ చేసిన ఈసీ, సీఎస్ను మాత్రం కదల్చలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సీఎస్ మార్పు తప్పలేదు.
సీఎంవోలో కీలక అధికారుల బదిలీ
ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం సాధించిన తర్వాత చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చిన జవహర్ రెడ్డికి సుమారు అరగంట వెయిట్ చేయించిన తర్వాత మాత్రమే అపాయింట్మెంట్ లభించింది. అది కూడా కేవలం నిమిషంలోపే పూర్తయిపోయింది. ఇక చంద్రబాబును కలిసిన తర్వాత తాను సెలవుపై వెళ్తున్నట్లు జీఏడీ అధికారులకు సమాచారం ఇచ్చారు జవహర్రెడ్డి. తాజాగా కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే సీఎస్ పదవి బాధ్యతలు చేపట్టారు నీరబ్ కుమార్ ప్రసాద్. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉన్న నీరబ్ కుమార్ ప్రస్తుతం అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇదిలావుంటే, జగన్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన పూనం మాలకొండయ్య, ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..కొత్త సీఎస్ నీరబ్ కుమార్. జీఏడీలో రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు.
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ముద్దాడ రవిచంద్ర..!
జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. అయితే అంతకంటే ముందే సీఎంఓ టీమ్పై కసరత్తు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన ముద్దాడ రవిచంద్రను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముద్దాడ రవిచంద్ర ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నాయి. ఇక సాయిప్రసాద్, గిరిజా శంకర్ వంటి సీనియర్ అధికారులను కూడా సీఎం కార్యాలయంలోకి తీసుకుంటారని తెలుస్తోంది.
చంద్రబాబుపై కేసులు పెట్టిన అధికారుల్లో టెన్షన్
సీఎస్, సీఎంఓతో పాటు ఇతర శాఖల్లో కూడా చాలా మంది అధికారులకు స్వస్తి పలికి కొత్త అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. గత సీఎస్ జవహర్రెడ్డితో పాటు మరికొందరు అధికారుల విషయంలోనూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. స్కిల్స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంతో పాటు ఇతర కేసుల్లో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తాజా పరిణామాలతో కలవరం చెందుతున్నారు. గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు, సీఐడీ చీఫ్ సంజయ్ గురువారం చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. వీరితో పాటు సిట్ చీఫ్గా వ్యవహరించిన కొల్లి రఘురామిరెడ్డి కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. వీరంతా కూడా చంద్రబాబు అరెస్ట్లో కీలకంగా వ్యవహరించిన అధికారులే. వీరితో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కూడా చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. అయితే వీరిని కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు చంద్రబాబు. దీంతో చేసేదేం లేక అక్కడినుంచి వెనుదిరిగారు ముగ్గురు అధికారులు. ఇక బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకట్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్గా ఉన్న విజయకుమార్ రెడ్డి తమ డిప్యూటేషన్ రద్దు చేయాలని కోరినప్పటికీ ఎవరినీ రిలీవ్ చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎప్పుడు ఏ అధికారి విషయంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయోనని తెగ టెన్షన్ పడుతున్నారు.
బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఇంట్లో సీఐడీ సోదాలు
మరోవైపు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఉన్న ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను అధికారులు తనిఖీ చేశారు. జగన్ హయాంలో అమలు చేసిన మద్యం పాలసీలో కీలకంగా వ్యవహరించారు వాసుదేవరెడ్డి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలోనే సీఐడీ సోదాలు జరిపినట్టు తెలుస్తోంది.
అధికారుల్లో దడ పుట్టిస్తున్న “రెడ్ బుక్”
గత ప్రభుత్వం ఒత్తిడితో చాలామంది అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ నేతలపై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి అధికారులకు ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ప్రస్తుతం మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్గా ఉన్న శ్రీలక్ష్మి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో జైలుపాలైన దాఖలాలు ఉన్నాయి. తాజాగా ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలో కూడా కీలకంగా ఉన్న చంద్రబాబు తమ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆలిండియా సర్వీస్ అధికారుల గుండెల్లో దడ మొదలైంది. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు “అయ్యాఎస్” అంటూ తలొగ్గి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న అధికారుల పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోననే చర్చ కూడా అధికారుల్లో మొదలైంది. మరోవైపు వైసీపీ హయాంలో టీడీపీపై కక్షపూరితంగా వ్యవహరించిన అధికారుల పేర్లు రెడ్బుక్లు రాశానన్న లోకేష్.. అధికారంలోకి వచ్చాక వారి పనిపడతామని హెచ్చరించారు. ఇప్పుడు బంపర్ మెజార్టీతో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ అధికారులను ఈ రెడ్బుక్ అంశం టెన్షన్ పెడుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే రెడ్బుక్పై రియాక్ట్ అయ్యారు లోకేష్. తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షపూరిత చర్యలు ఉండవని స్పష్టం చేశారు.
భూములు, గనులు, ఇసుక, మద్యం పాలసీల్లో అవినీతి జరిగిందన్న టీడీపీ
జగన్ పాలనలో భూములు, గనులు, ఇసుక, మద్యం.. వీటన్నింటిలోనూ అవినీతి జరిగిందనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ, అమిత్షా, రాజ్నాథ్ సింగ్ కూడా జగన్ ప్రభుత్వం అవినీతిలో మునిగితేలిందంటూ ఆరోపించారు. బీజేపీ టార్గెట్ చేసిన అంశాలు కూడా ఇవే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఈ మేరకు కొన్ని ఆధారాలు సేకరించి పెట్టుకుంది. వాటిపై విచారణకు ఆదేశించి ఆ నివేదిక ఆధారంగా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..