
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి. ఆయా పార్టీల నేతలు ఎవరికివారు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తు్న్నారు. ఇప్పటికే.. అధికార వైసీపీ సామాజిక సాధికార యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేయగా.. తాజాగా.. టీడీపీ కూడా.. రా.. కదలిరా.. పేరు సభలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు సభల్లో పాల్గొని.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వంపై అస్త్రాలు సంధిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ క్రమంలోనే.. ఇవాళ.. అల్లూరి జిల్లా అరకు.. రా.. కదలిరా సభల్లో పాల్గొన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వచ్చిందన్నారు చంద్రబాబు. సీఎం జగన్ దోపిడీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు బలైపోయారని ఆరోపించారు. ఇక.. ఓటమి ఖాయమని సర్వేలు రావడంతో.. మార్పులు చేర్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.
మరోవైపు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట రా.. కదలిరా.. సభలోనూ పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా.. జగన్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయిందన్నారు చంద్రబాబు. అలాగే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే.. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఒక హామీ ప్రకటించామని.. త్వరలోనే టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పారు చంద్రబాబు.
ఇదిలావుంటే.. ఉదయం అరకు వెళ్లాల్సిన చంద్రబాబు హెలికాప్టర్ దారి మళ్లడం కలకలం రేపింది. అరకు తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్ విశాఖ నుంచి మరో దారిలో వెళ్తున్నట్లు గుర్తించిన ATC.. వెంటనే పైలట్ను అలెర్ట్ చేసి సరైన దారిలోకి మళ్లించింది. అసలు హెలికాప్టర్ ఎందుకు దారి మారిందన్నదానిపై ఎంక్వైరీ చేపట్టారు ఏవియేషన్ అధికారులు. పైలెట్.. రెండు రాడార్లకు అరకు డెస్టినేషన్ సెట్ చేసుకోగా.. ఒక రాడార్కు మాత్రం విజయవాడ డెస్టినేషన్గా పెట్టారు. కానీ.. రాడార్కి సమాచారం ఇవ్వడంలో లోపం జరిగిందని గుర్తించారు. ఇక.. అదే హెలికాప్టర్లో మండపేట సభకు చేరుకున్నారు చంద్రబాబు. అటు.. చంద్రబాబు హెలికాప్టర్ ఇష్యూపై DGCA కూడా ఆరా తీసింది. మొత్తంగా.. ఏటీసీ అలెర్ట్ చేయడంతో ఏవియేషన్ అధికారులతోపాటు టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..