Union Budget 2024: ఇది ఆరంభం మాత్రమే.. కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

|

Jul 23, 2024 | 5:29 PM

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాల జల్లు ప్రకటించడంపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి ఆక్సిజన్ అందించి కేంద్రం బతికిస్తుందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Union Budget 2024: ఇది ఆరంభం మాత్రమే.. కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
Chandrababu Pawan Kalyan
Follow us on

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాల జల్లు ప్రకటించడంపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి ఆక్సిజన్ అందించి కేంద్రం బతికిస్తుందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని.. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో అధిక కేటాయింపులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. రాజధాని కోసం రూ.15 వేల కోట్లు కేటాయించినందుకు.. పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

సామాన్య ప్రజలకు బలం చేకూర్చింది: కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

దేశంలోని సామాన్య ప్రజలకు బలం చేకూర్చే పని ప్రభుత్వం చేసిందన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు. ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. బడ్జెట్‌లో ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపారు. 15 వేల కోట్ల ప్యాకేజీని అందించినందుకు రాష్ట్ర ప్రజలు, రైతులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాలని కేంద్రమంత్రి కోరారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాం: నాదేండ్ల

కేంద్ర బడ్జెట్‌పై జనసేన నేత నాదెండ్ల ప్రశంసలు కురిపించారు. బడ్జెట్‌లో ఏపీకి పెద్దపీట వేశారు.. జనసేన తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇది అమరావతికి కూటమి పూర్వ వైభవం తెస్తుందన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని.. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తామని, రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

కేంద్రం నుంచి ఏపీకి అన్ని విధాలుగా సాకారం: పురంధేశ్వరి

బడ్జెట్‌‌లో ఏపీకి కేటాయింపులపై ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి, పోలవరం నిర్మాణం కేంద్రం తీసుకున్నట్టేనని.. దీనిలో భాగంగా అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇతర సంస్థల నుంచి నిధులు తెచ్చుకోవడానికి మార్గం సుగుమం చేసిందని.. పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. కేంద్రం నుంచి ఏపీకి అన్ని విధాలుగా సాకారం లభించిందని పురంధేశ్వరి వివరించారు.

ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి బడ్జెట్: సీఎం రమేష్

బడ్జెట్‌లో ఏపీకి పోలవరం, రాజధాని, ఇండస్ట్రియల్ కారిడార్‌ సహా చాలా ప్రయోజనాలు చేకూరాయన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి బడ్జెట్ కేటాయించనందుకు ఆనందంగా ఉందన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదాను కేంద్రం పట్టించుకోలేదు.. సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి: షర్మిల

బడ్జెట్‌లో ప్రత్యేకహోదా సహా ఏపీప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు. కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని మాటలకు పరిమితమయ్యిందన్నారు షర్మిల.అమరావతికి రూ 15 వేల కోట్లు విదిల్చిందని.. దీనికి పండగ చేసుకోవాలా అని ప్రశ్నించారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..