
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశాలు 2026 జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రారంభమయ్యాయి . ఈ ఏడాది దావోస్ సదస్సు భారత్కు ప్రత్యేకంగా మారింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్, 10 రాష్ట్రాల భాగస్వామ్యం, కేంద్ర మంత్రులు, 6 మంది ముఖ్యమంత్రులు, 100కుపైగా భారతీయ సీఈవోలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈసారి దావోస్ వేదికపై భారత్ కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక భవిష్యత్ను గ్లోబల్ లీడర్ల ముందు ప్రదర్శించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దావోస్లో ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్ ఈసారి ఒక మినీ ఎకానమీలా మారింది. ఉదయం నుంచి రాత్రివరకు వరుసగా రాష్ట్రాల రౌండ్టేబుల్ మీటింగ్లు, సీఈవో ఇంటరాక్షన్లు, ఇండస్ట్రీ సెషన్లు జరుగుతున్నాయి. గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు ఒకే రోజు మూడు నుంచి నాలుగు రాష్ట్రాలతో సమావేశాలు జరపడం ఈసారి కొత్త ట్రెండ్గా మారింది. భారత్ ఈసారి ‘వన్ నేషన్ – మల్టిపుల్ డోర్స్’ వ్యూహంతో ముందుకు వచ్చింది. అంటే ఒకే దేశం కానీ పెట్టుబడులకు ఎన్నో ప్రవేశ దారులు. ఇదే సందేశం గ్లోబల్ ఇన్వెస్టర్లకు బలంగా చేరాలా ప్లాన్ చేసింది భారత్ .
ఈ దావోస్ సమావేశాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. ప్రతి రాష్ట్రం తమ బలాలు, పెట్టుబడి అవకాశాలను ప్రపంచ కంపెనీలకు వివరిస్తోంది. దీంతో రాష్ట్రాల మధ్య పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి దావోస్కు స్పష్టమైన విజన్తో వచ్చారు. దావోస్ బయలుదేరే ముందు సమ్మక్క–సారలమ్మ జాతరలో ప్రార్థనలు చేయడం ద్వారా ఆయన రాజకీయంగానే కాదు, భావోద్వేగంగా కూడా ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. ఈ తెల్లవారు జామున జ్యూరిచ్ చేరుకున్న సిఎంకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్తో 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని గ్లోబల్ వేదికపై వివరించనున్నారు . దావోస్లో తెలంగాణ పెవిలియన్లో గూగుల్, సేల్స్ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, లొరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి టాప్ గ్లోబల్ కంపెనీల సీఈవోలతో ఎక్స్క్లూసివ్ మీటింగ్లు ఉండనున్నాయి . తెలంగాణ పెవిలియన్లో IT, AI, లైఫ్ సైన్సెస్, తయారీ విస్తరణ, ఇన్నోవేషన్ రంగాలపై చర్చలు సాగుతున్నాయి. గత ఏడాది దావోస్లో వచ్చిన పెట్టుబడి హామీల అమలు ఈసారి ప్రధాన అజెండాగా మారింది. హైదరాబాద్లో ఉన్న గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలు విస్తరించడంపై చర్చలు జరుపుతున్నాయి. కొన్ని సంస్థలు హైదరాబాద్ను తమ ఆసియా హెడ్క్వార్టర్స్గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ బృందం దావోస్లో ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేయడం ప్రధాన హైలైట్. బెల్వెడేర్, ప్రొమెనేడ్ 89లో ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. చాలా రాష్ట్రాలు ఇండియా పెవిలియన్ను పంచుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్కు స్వంత పెవిలియన్ దక్కడం దావోస్ వేదికపై రాష్ట్ర స్థాయిని సూచిస్తోంది. మంత్రి నారా లోకేశ్, టీ.జి. భరత్ సహా బలమైన బృందంతో చంద్రబాబు నాయుడు స్విస్ కంపెనీలతో ఫోకస్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. AI హబ్ అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, అధునాతన తయారీ రంగం, అగ్రి–ఫుడ్ హబ్, క్వాంటం టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ రీసెర్చ్ వంటి రంగాలపై ఆంధ్రప్రదేశ్ బలమైన పిచ్ ఇస్తోంది. ముఖ్యంగా బుహ్లర్ గ్రూప్తో అగ్రి–ఫుడ్ రంగంలో భాగస్వామ్యంపై చర్చలు సాగుతున్నాయి ఉదయం వేళల్లో తయారీ రంగంపై మీటింగ్లు, సాయంత్రం వేళల్లో టెక్, ఎనర్జీ రంగాలపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని యూరోపియన్ కంపెనీలు ఇప్పటికే రాష్ట్రాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
దావోస్ వేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సైలెంట్ పోటీ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తయారీ రంగంలో దూసుకెళ్తుంటే, తెలంగాణ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ముందంజలో ఉంది. అయితే రెండు రాష్ట్రాల సందేశం మాత్రం ఒకటే – భారత్లో పెట్టుబడులకు తెలుగు రాష్ట్రాలు సురక్షిత, గమ్యస్థానాలుగా చాటి చెపుతున్నారు . ఈసారి దావోస్లో కీలక చర్చలు లాబీలు, కాఫీ బ్రేక్లలో, మంచుతో నిండిన నడక మార్గాల్లోనే నిజమైన డీల్స్పై చర్చలు జరుగుతున్నాయి. ఒక చిన్న కాఫీ మీటింగ్ పెద్ద పెట్టుబడులకు దారి తీసే అవకాశం ఉందని భారత అధికారులు చెబుతున్నారు.