BJP MP GVL: ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి.. జిన్నా వారసత్వాన్ని కొనసాగిస్తే ఒప్పుకోము: ఎంపీ జీవీఎల్

|

Feb 04, 2022 | 8:16 PM

BJP MP GVL: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)ప్రభుత్వ తీరుపై, ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యక్రమంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యక్రమం ఓ ఉద్యమాన్ని తలపించిందన్నారు..

BJP MP GVL: ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి.. జిన్నా వారసత్వాన్ని కొనసాగిస్తే ఒప్పుకోము: ఎంపీ జీవీఎల్
Bjp Mp Gvl Narasimha Rao
Follow us on

BJP MP GVL: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)ప్రభుత్వ తీరుపై, ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యక్రమంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యక్రమం ఓ ఉద్యమాన్ని తలపించిందన్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో ఆందోళన చూడలేదన్నారు. అయితే ఈ ఉద్యమంలో కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీలు చేరారని ప్రభుత్వం చెబుతుంది.. నిజంగా ఇంత మందిని తరలించే శక్తి ఆ పార్టీలకు ఉంటే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో గెలిచి ఉండేవారంటూ సంచలన కామెంట్స్ చేశారు జీవీఎల్. ఉద్యోగుల ఆందోళనలు తక్కువ చేసి చూపడం వల్ల ప్రభుత్వానికే నష్టమని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే స్పందించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే ఇదే తరహాలో మరిన్ని నిరసనలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

ఈ ఆందోళనలపై బిజెపి రాష్ట్ర కోర్ కమిటీలో చర్చించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు జీవిఎల్. అంతేకాదు కమిటీ సమావేశంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి జోక్యం అవసరమని .. అసలు ఈ అంశంపై ముఖ్యమంత్రిని మరెవరో తప్పుదారి పట్టించారు అనుకోవడానికి వీలులేదంటూ కామెంట్ చేశారు. ఆదివారం రాత్రి వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో పాలన స్తంభించి, చిన్నాభిన్నం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు గుంటూరులో జిన్నా టవర్ రంగులు మార్చడంపై కూడా జీవిఎల్ స్పందించారు. జిన్నా టవర్ రంగులు మార్చడానికి ప్రభుత్వం ఒప్పుకుంది, కానీ టవర్ పేరు మార్చడానికి అంగీకరించడం లేదు. దేశ విభజనకు, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోదానికి కారకుడైన వ్యక్తి పేరు ఈ టవర్ కి పెట్టడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని చెప్పారు. ఏపీలో ఇంకా జిన్నా వారసత్వాన్ని కొనసాగించాలన్న తాపత్రయం కనిపిస్తుందంటూ ఎద్దేవా చేశారు.

ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో దేశంలోని 40 ప్రదేశాలు ఉండగా, అందులో ఒకటి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు.. లేపాక్షి వంటి అద్భుతమైన కళారూపం కలిగిన కట్టడాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి.. వాటి అభివృద్ధి, అంతర్జాతీయ గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏదీ కనిపించడం లేదంటూ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం అసలు వారసత్వ సంపద గుర్తింపు పై ఒక్కసారైనా చొరవ తీసుకుని మాట్లాడిన సందర్భం కూడా లేదు… అయితే తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడినట్లు ఈ సందర్భంగా చెప్పారు. లేపాక్షి సంపదకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరినట్లు జీవిఎల్ చెప్పారు.

Also Read:

బాలకృష్ణ రాజీనామాను ప్రజలు కోరుకుంటున్నారు అంటున్న మంత్రి శంకర్ నారాయణ