
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్గా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారైతే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఉత్తరాంధ్రలో అభివృద్ధి దశాదిశను మలుపుతిప్పే ప్రాజెక్ట్గా భావిస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేస్తోంది.
జులై 5 లేదా 8, ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో ఒకదానిని ఖరారు చేసే అవకాశముందని కేంద్ర విమానయాన శాఖ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రధాని షెడ్యూల్ ఫైనల్ అయిన వెంటనే అధికారిక ప్రకటన రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఎయిర్పోర్ట్, ఉత్తరాంధ్రకు కొత్త ఆర్థిక దిశను చూపనుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రయల్ ఫ్లైట్ విజయవంతంగా పూర్తవ్వడంతో మిగతా పనులు మరింత వేగం అందుకున్నాయి. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే కాకుండా ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు కూడా ప్రధాన ఎయిర్ హబ్గా మారనుంది. పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్య రంగాలకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. జూన్ 30, 2026 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం భారీ యంత్రాలు, వందలాది కార్మికులతో పనులు రాత్రింబవళ్లు కొనసాగుతున్నాయి.
మొత్తం 2,203 ఎకరాల్లో రూ.4,750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్ట్ తొలి దశలోనే సంవత్సరానికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో సిద్ధమవుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ కార్గో సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నేవీ ఆధీనంలో ఉండటంతో అంతర్జాతీయ విమానాల సేవలు పరిమితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అయితే దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ గణనీయంగా మెరుగవుతుంది.
ఇప్పటివరకు సుమారు 99 శాతం పనులు పూర్తయ్యాయి. రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ట్యాక్సీవేలు, భూసమీకరణ పనులు పూర్తయ్యాయి. టెర్మినల్ బిల్డింగ్, యాక్సెస్ రోడ్లు కూడా తుదిదశలో ఉన్నాయి. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో పనులు ముగిసే అవకాశముంది. ఇంతటి భారీ ప్రాజెక్ట్ పూర్తయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి గమనాన్ని వేగవంతం చేసే కీలక మైలురాయిగా నిలవనుంది. ఎగుమతులు పెరగడం, వ్యాపార అవకాశాలు విస్తరించడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వంటి అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ వార్తలు రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి