
చికెన్, రొయ్యలు, చేపలు, పీతలు, ఇలా ఏ నాన్-వెజ్ పచ్చడి అయినా అదిరిపోయే టేస్ట్తో కావాలంటే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లాల్సిందే. ఇక్కడ దొరికని నాన్-వెజ్ పచ్చడి అంటూ ఉండదు. ఇక సంక్రాంతి లాంటి పండుగలు వేస్తే ఆ ఏర్పాట్లు వేరుగా ఉంటాయి. రకరకాల నాన్-వెజ్ పచ్చళ్లు తయారు చేస్తారు స్థానిక చేయి తిరిగిన వంటమనుషులు. స్పెషల్గా తయారు చేసే నాన్-వెజ్ పచ్చళ్లలో కొరమీను పచ్చడి ఒకటి. నాన్ వేజ్ ప్రియులకు మరింత ఇష్టమైనది కొరమీను. ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి కొరమీను పచ్చడి తయారు చేయించుకుంటారు. ఈ కొరమీను పచ్చడి కోసం మన తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా అమెరికా, సింగపూర్, దుబాయ్ లాంటి ఇదేర దేశాల్లో ఉన్న వారు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చి తయారు చేయించుకుని తీసుకుని వెళతారు.
కొరమీను పచ్చడిని చాలా జాగ్రత్తలు తీసుకొని తయారు చేసారు. పచ్చడికి కావల్సిన మసాలాల నుంచి ఆయిల్ వరకూ అన్నీ నాణ్యమైనవి వాడితేనే ఆ పచ్చడి రుచి మరింత పెరుగుతుందని అంటున్నారు గొట్టుముక్కల శివప్రసాద్ రాజు. ఆయన కొరమీను పచ్చడి చేసే విధానాన్ని వివరించారు.
తొలుత కేజీన్నరపైన ఉండే కొరమీనులను తీసుకోవాలి. వానిని శుభ్రం చేసుకుని పై చర్మం, తల భాగాన్ని తీసివేయాలి. తరువాత ఉప్పు, నిమ్మకాయ, పెరుగు వేసి నీసు వాసన రాకుండా కడగాలి. తరువాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి, నూనె మరుగుతూ ఉండగా శుబ్రం చేసిన కొరమీను ముక్కలు వేసుకొని బాగా వేయించాలి. ముక్కలు బాగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పచ్చడికి కావల్సిన ప్రత్యేక మసాలాలు తయారు చేయాలి. దాల్చినచెక్క, లవంగాలు, యాలికలు, జీలకర్ర, ధనియాలతో మసాలా పొడి తయారు చేసుకోవాలి. ఉప్పు, కారం, వెల్లుల్లితో మసాలా పోడిని నూనెలో కలుపుకుని పచ్చడికి కావల్సిన గ్రేవీ తయారు చేసుకోవాలి. కొరమీను ముక్కల్లో తగినంతగా తయారు చేసుకున్న గ్రేవీ వేసి బాగా కలుపుకోవాలి. అందులోకి అవసరమైనంత నిమ్మరసం పిండాలి. పచ్చడిలో ముక్కలు మునిగేంతగా వేరుశనగ నూనె వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. అంతే ఘుమఘుమలాడే, రుచికరమైన కొరమీను పచ్చడి రెడీ అవుతుందని గొట్టుముక్కల శివప్రసాద్ రాజు చెబుతున్నారు. ఇలా తయారు చేసిన కొరమీను పచ్చడి ఆరు నెలలు వరకూ నిల్వ ఉంటుందని అంటున్నారు.
Shiva Prasad Raju
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..