Andhra Pradesh: కాలువలో పడిపోయిన కారు.. దేవుడిలా వచ్చిన అయ్యప్ప స్వాములు.. ఆ తర్వాత డ్రైవర్..

కొమ్మాలపాడు వద్ద ఎన్ఎస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదవశాత్తు అదుపుతప్పి కాలువలో పడిపోయిన కారు డ్రైవర్‌ను అక్కడే స్నానాలు చేస్తున్న అయ్యప్ప స్వాములు సాహసంతో కాపాడారు. కారు పూర్తిగా మునిగిపోగా ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. దీంతో పోలీసులు కారులో ఏముంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh: కాలువలో పడిపోయిన కారు.. దేవుడిలా వచ్చిన అయ్యప్ప స్వాములు.. ఆ తర్వాత డ్రైవర్..
Car Plunges Into Nsp Canal

Edited By:

Updated on: Nov 23, 2025 | 1:28 PM

బాపట్ల జిల్లా జిల్లాలోని సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద అద్దంకి – నార్కెట్‌పల్లి రోడ్డుపై కారు అదుపుతప్పి ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన కలకలం రేపింది. అయితే కాలువలో స్నానం చేస్తున్న కొందరు అయ్యప్ప స్వాములు అప్రమత్తతతో వ్యవహరించి కారులో చిక్కుకున్న డ్రైవర్‌ను సురక్షితంగా కాపాడారు. వినుకొండ నుండి ఒంగోలు వైపు వెళ్తున్న కారుకు కొమ్మాలపాడు వద్ద అకస్మాత్తుగా ఒక మోటార్ సైకిల్ అడ్డు వచ్చింది. మోటార్ సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది.

కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు వేగంగా మునిగిపోవడం ప్రారంభించింది. కారులో చిక్కుకున్న డ్రైవర్ బయటకు రాలేక, ప్రాణభయంతో కేకలు వేశాడు.
అదే సమయంలో కాలువలో స్నానాలు చేస్తున్న కొందరు అయ్యప్ప స్వాములు, స్థానికులు కారును, డ్రైవర్ హాహాకారాలను గమనించారు. వారు వెంటనే స్పందించి, డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే కారు పూర్తిగా కాలువ నీటిలో మునిగిపోయింది.

పరారైన డ్రైవర్.. అనుమానాలు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని వివరాలు అడగడానికి పోలీసులు ప్రయత్నించగా, ఆ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై, కారు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణలో ఆ డ్రైవర్‌ను కంచికచర్లకు చెందిన పవన్ కుమార్‌గా గుర్తించారు. కారులో ఏమైనా అసాంఘిక పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మునిగిపోయిన కారును కాలువ నుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.