
ఎలక్ట్రిక్ బస్సులే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో కొత్త ఉద్యమానికి కేంద్రబిందువుగా మారాయి. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణకు తలుపులు తెరుస్తున్నారు అంటూ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విజయవాడలో జరిగిన కీలక సమావేశంలో ఉద్యోగ సంఘాలు భవిష్యత్ పోరాట కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లతో నడపాలనే నిర్ణయం సంస్థ ఉనికికే ముప్పుగా మారుతుందని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు దామోదర్, నరసయ్య వ్యాఖ్యానించారు. ఇది కేవలం బస్సుల నిర్వహణ అంశం కాదని.. దశలవారీగా ఆర్టీసీనీ ప్రైవేటీకరించే ప్రక్రియలో భాగమని ఆరోపించారు..ఈ నిర్ణయం అమలైతే ఉద్యోగుల భద్రత, ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో పాటు ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
అందుకే అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్క వేదికపైకి వచ్చి సంయుక్త కార్యాచరణకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి తమ అభ్యంతరాలను తెలియజేస్తూ జూన్ 11న RTC వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కు, అలాగే ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఆ తర్వాత కూడా స్పందన రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.
జూన్ 16 నుంచి 20 వరకు రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలో ఐదు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించనుండగా, జూన్ 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లలో ఉద్యోగులు ఎర్ర రిబ్బన్లు ధరించి విధులకు హాజరవడంతో పాటు డిపో గేట్ల వద్ద ధర్నాలు చేపట్టనున్నారు. ఇక ఈ నెల 28 తేదీన మరోసారి సమావేశమై తదుపరి దశ పోరాట కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.