
ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనితో పాటుగా కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆదివారం విజయనగరం,విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలంలో ఉండరాదన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించారు.
Also Read: భలే పవర్ఫుల్.. కోటి రూపాయలు ఇచ్చిన కూడా ఇది దొరకదు అని పెద్దలు అంటారు..