AP Weather Alert: ఏపీని వెంటాడుతున్న రెయిన్ ఫియర్.. మరో పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ..
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెయిన్ ఫీయర్ వెంటాడుతోంది. నిన్న మొన్నటి దాకా వరుణుడు సృష్టించిన బీభత్సాన్ని మరువక..
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెయిన్ ఫీయర్ వెంటాడుతోంది. నిన్న మొన్నటి దాకా వరుణుడు సృష్టించిన బీభత్సాన్ని మరువక ముందే, మరో పిడుగు లాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. ఏపీకి వరుణుడి నుంచి మరో ఉపద్రవం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా దక్షిణాంధ్రప్రదేశ్ను వరుస తుఫాన్లు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే భారీ వరదలతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వసం అయ్యాయి. ఇప్పటికీ అనేక గ్రామాలు వరద ముంపులోనే మగ్గుతున్నాయి. దీని నుంచి బయటపడక ముందే.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ ప్రకటించింది. ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ జారీ చేసిన ఈ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలు వరద ముప్పు నుంచి తేరుకోకమునుపే అల్పపీడనం రూపంలో మరో గండం వెంటాడుతోంది.
ఈనెల 29 నాటికి దక్షిణ అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక శనివారం నాడు రాష్ట్రమంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.
బంగాళాఖాతంలో కొమరిన్ ప్రాంతం, శ్రీలంక తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ప్రకటించారు. అటు అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరులో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు.
Also read:
గ్యాస్ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్లోనే 143.4 శాతం వానలు..
Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు