
ఏపీలో అకాల వర్షాలు జనాలను ఆగమాగం చేస్తున్నాయి. తాజాగా కడప జిల్లా వ్యాప్తంగా పిడుగు పాటుతో కూడిన వర్షాలు స్థానిక ప్రజల మనుగడను దెబ్బతీశాయి. ఓ ఇంటిపై పిడుగు పడడంతో ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కడప జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులో కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే మైదుకూరు మండలం మిట్టమాను పల్లె ఎస్సీ కాలనీలో ఓ ఇంటిపై పిడుగు పడింది.
అంతే ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. అందులోనూ అది పూరిగుడిసె కావడంతో ఆ మంటలు క్షణాల్లో గుడిసె మొత్తం వ్యాపించాయి. దీంతో నిమిషాల్లో ఇల్లు మొత్తం మంటల్లో కాలిపోయింది. అయితే ప్రమాద సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణానష్టం జరగలేదు. వెంటనే స్పందించిన గ్రామస్తులు వారు రెవెన్యూ అధికారులకు చెప్పడంతో వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రజలకు అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. గాలి వాన వచ్చే సమయంలో భారీగా పిడుగులు పడతాయని.. ఆ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లకింద ఉండకూడదని, మరి ముఖ్యంగా పూరి గుడిసెలలో ఉన్నవారు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదిగో వీడియో.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.