
ఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి సెప్టెంబర్ 20న ఉదయం 08:30 గంటల సమయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, సెప్టెంబర్ 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై సెప్టెంబర్ 22 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగామారే అవకాశం ఉంది. ఇది అదే పశ్చిమ-వాయువ్య దిశలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ సెప్టెంబర్ 23 ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాల సమీపంలోని పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణశాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఈరోజు,రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడ్రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుండి 50 కిమీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, ఈ రోజు ఉదయానికి ఉత్తర అండమాన్, దానిని ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి, రేపటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, ఎల్లుండి నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో రేపు, ఎల్లుండి చెదురుమదురుగా భారీ వర్షాలు, బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 50-60కిమీ వేగంతో బలమైనఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అల్లూరి, పోలవరం, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.