
ఏపీలోని విద్యార్ధులకు గుడ్ న్యూస్. తల్లికి వందనం డబ్బులపై క్లారిటీ వచ్చేసింది. ఇవి ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వీటిని అకౌంట్లలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో తల్లికి వందనం నిధులపై చర్చ జరిగింది. అకౌంట్లలో ఎప్పుడు జమ చేయాలనే దానిపై చర్చించారు. అనంతరం ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఈ విద్యా సంవత్సరంలో తొలి మెగా పేరేంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించే లోపే తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయించారు. దీంతో త్వరలోనే ఇవి జమ కానున్నాయని తెలుస్తోంది. స్కూల్స్ ప్రారంభమైతే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్లు, దుస్తులు లాంటి ఖర్చులు చాలా ఉంటాయి. ఇక స్కూల్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పథకం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తింపచేస్తున్నారు. స్కూల్స్ మెయింటెన్స్ కోసం రూ.2 వేలు మినహాయించి రూ.13 వేలను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తున్నారు. కాగా వేసవి సెలవుల అనంతరం ఏపీలో స్కూల్స్ ఈ నెల 12 నుంచి, జూనియర్ కాలేజ్లు ఈ నెల 6 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో ఈ నెల లేదా వచ్చే నెలలో వీటిని జమ చేసే అవకాశముంది.