ఈ నెల 4వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా డిసెంబర్ 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 48 గంటల్లో వాయుగుండంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 8 ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరే అవకాశం ఉందన్నారు. ఈ అల్పపీడన ద్రోణీ ప్రభావం కారణంగా ఏపీలో రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..