AP Floods: వరదల్లో డ్యామేజ్‌ అయిన ఇళ్లకు కూడా పరిహారం.. ఏపీ మంత్రి ప్రకటన

|

Nov 22, 2021 | 4:03 PM

ఒకటి కాదు..రెండు కాదు..వారం రోజులు భారీ వర్షాలు...కరువుసీమలో వరుణుడు సృష్టించిన బీభత్సం కళ్లెదుట కనిపిస్తోంది. ఎటుచూసినా జల విలయమే.

AP Floods: వరదల్లో డ్యామేజ్‌ అయిన ఇళ్లకు కూడా పరిహారం.. ఏపీ మంత్రి ప్రకటన
Perni Nani
Follow us on

వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు మంత్రి పేర్నినాని. వరదలో నష్టపోయిన ప్రతి ఇంటికి 2 వేల రూపాయలు తక్షణ సాయం అందజేస్తున్నామని ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు 5 లక్షలు, ఇంటి డ్యామేజ్‌కి 75 వేల రూపాయలు అందజేస్తామన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో అసువులు బాసిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి పేర్నినాని.

భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాల్లో విపత్కర పరిస్థితులు: 

ఒకటి కాదు..రెండు కాదు..వారం రోజులు భారీ వర్షాలు…కరువుసీమలో వరుణుడు సృష్టించిన బీభత్సం కళ్లెదుట కనిపిస్తోంది. ఎటుచూసినా జల విలయమే. ఇది చాలదన్నట్టు మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటూ వెదర్‌ రిపోర్ట్‌ సీమవాసులను వణికిస్తోంది. జలఖడ్గం పూర్తిగా తొలగిపోలేదు. కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు వరద ముంపులోనే ఉన్నాయి. ఇక ప్రకాశం, గుంటూరు జిల్లాలకు కూడా వానలు విస్తరించాయి. ఇప్పటికే వరదలు సృష్టించిన విలయానికి రాయలసీమ ఇంకా ముంపులో మగ్గుతోంది. వరుణుడి మహోగ్రరూపానికి సీమ జిల్లాలు చీమల్లా చితికిపోతున్నాయి. అనంతపురం టు కడప, చిత్తూరు టు నెల్లూరు-ఎక్కడ చూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయ్.

ఇప్పటికీ వేలాది గ్రామాలు జలదిగ్బంధంలో నానుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే, ఎటుచూసినా నీళ్లే. ఊహకందనివిధంగా విరుచుకుపడిన జల విలయానికి జనజీవనం కకావికలమవుతోంది. తినేందుకు తిండి దొరక్క, తాగేందుకు నీరు లేక జనం అల్లాడిపోతున్నారు. పదుల సంఖ్యలో జల సమాధి అయితే, వందలమంది చావుదాకా వెళ్లొచ్చారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నదులు, వాగులు, వంకలు మహోగ్రరూపం దాల్చడంతో ఇప్పటికీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడు ఏ నది, ఏ వాగు ముంచేస్తుందోనని క్షణక్షణం భయపడిపోతున్నారు.

అటు జల విధ్వంసానికి టెంపుల్‌ సిటీస్ తిరుపతి, తిరుమల ఇప్పటికీ చిగురుటాగుల్లా వణికిపోతున్నాయి. కడప జిల్లాలో పాపాగ్ని నదికి వరద పోటెత్తడంతో వంతెన కూలిపోయింది. ముందే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు రాకపోకల్ని నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. బ్రిడ్జ్ వైపు ఎవరూ వెళ్లకుండా గోడ కూడా నిర్మిస్తున్నారు అధికారులు. నెల్లూరు జిల్లాలో వరుణుడి విధ్వంసం కొనసాగుతోంది. జిల్లా అంతటా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయ్. కుండపోత వర్షాలకు ఊళ్లూ ఏర్లు ఏకమవుతున్నాయ్. అసలు ప్రజలు ఊర్లో ఉన్నారా? లేక చెరువులో ఉన్నారా? అన్నంతగా గ్రామాలను వరదలు ముంచెత్తుతున్నాయ్. పెన్నాతోపాటు ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లా ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద బీభత్సానికి నెల్లూరు దగ్గర నేషనల్ హైవే తెగిపోయిందంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వెదర్‌ రిపోర్ట్‌ హెచ్చరిస్తోంది. ఆయా జిల్లాల మంత్రులు, ఇంఛార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ.. బాధితులను ఆదుకునే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిన అవసరం లేదని సూచించారు.

Also Read: CM Jagan: రాజధాని అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన…

మైక్‌ టైసన్‌ గురించి సంచలన సీక్రెట్.. రింగ్‌లోకి దిగటానికి ముందు శృంగారం.. అదీ ఒకరిద్దరితో కాదు