
వాసుదేవరెడ్డి అరెస్ట్కు రంగం సిద్ధమైందా? వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరష్కరించిన హైకోర్టు.. ఏం చెప్పింది. ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోరుతూ వాసుదేవరెడ్డి వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. 18వ తేదీకి విచారణ వాయిదా వేసింది. జూన్ 18 లోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. తనను అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు వాసుదేవరెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. వాసుదేవరెడ్డి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించి కీలక పత్రాలు మాయం చేశారని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాసుదేవరెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు. ఇక వైసీపీ ప్రభుత్వానికి లబ్ది చేకూరేలా మద్యం పాలసీని రూపొందించారని ఆయనపై పెద్ద ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఎన్నికల సమయంలో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో వాసుదేవరెడ్డిని ఏపీబీసీఎల్ ఎండీ స్థానం నుంచి ఈసీ తప్పించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు చోరీచేసి తరలిస్తుండగా చూశానంటూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈనెల 6న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏపీ సీఐడీ అధికారులు. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు హైదరాబాదులోని నానక్రామ్ గూడలో వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు జరిపారు. సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు, ఇతర వివరాలు లభించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు నిరాకరించడంతో సీఐడీ అధికారులు వాసుదేవరెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం రాకముందు రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఉద్యోగిగా ఉండే దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి.. జగన్ సీఎం అయ్యాక.. ఏపీ ప్రభుత్వానికి డిప్యూటేషన్పై వచ్చారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…