
హీరోగా యాక్షన్ సన్నివేశాల్లో సాహసాలు.. రాజకీయ నాయకుడిగా ప్రజల మధ్య నిరంతర పర్యటనలు.. ఈ రెండింటి కారణంగా భుజాల గాయాలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబైలో సర్జరీ చేయించుకోనున్నారు. గతవారం వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ఆపరేషన్కు సిద్ధమవుతున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి ముంబైలోని ఆస్పత్రికి చేరుకోనున్నారు. గతవారం ఇదే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్కు రొటేటర్ కఫ్తో పాటు రెండు భుజాల కండరాలకు గాయాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు. శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినప్పటికీ, ముందుగా ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసి ఇప్పుడు ఆపరేషన్కు సిద్ధమయ్యారు.
సినీ జీవితంలో యాక్షన్ సన్నివేశాల సమయంలో తగిలిన గాయాలు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విస్తృత పర్యటనలు, అభిమానుల మధ్య జరిగే రద్దీ.. ఇవన్నీ భుజాలపై తీవ్ర ఒత్తిడికి కారణమయ్యాయని పవన్ కళ్యాణ్ గతంలో పలు సందర్భాల్లో ప్రస్తావించారు. కొంతకాలంగా నొప్పిని భరిస్తూనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, వైద్యుల సలహా మేరకు ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించారు.
శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఐదు రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. అనంతరం ఆరోగ్య పరిస్థితిని బట్టి తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తై, ఆయన పూర్తిస్థాయిలో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని అభిమానులు, పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి