AP Assembly Privileges Committee summons to Atchannaidu: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిని అగౌరవపరిచేలా బహిరంగంగా వాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ్యుడు అచ్చెన్నాయుడికి నోటీసివ్వాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అసెంబ్లీ స్పీకర్పై వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్రెడ్డి అధ్యక్షతన సభాహక్కుల సంఘం సోమవారం అసెంబ్లీలోని కమిటీ హాలులో సమావేశమై సమీక్షించింది. అచ్చెన్నాయుడుకి నోటీసులు పంపాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈవిషయంలో అచ్చెన్నాయుడు గతంలో ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని సభాహక్కుల సంఘం అభిప్రాయపడింది. ఫిర్యాదులోని అంశాలకు పూర్తిగా వివరణ ఇవ్వాలని గత డిసెంబర్ నెలలో, ఈ ఏడాది జనవరిలో రెండుసార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదని అధికారులు కమిటీకి నివేదించారు. దీంతో అచ్చెన్నాయుణ్ని కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు నోటీసివ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వ చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి చేసిన మరో ఫిర్యాదుపైనా ఆయన వివరణ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. దీనిపై అచ్చెన్నాయుడికి రిమైండర్ పంపాలని కమిటీ సూచించింది. మరో తెదేపా ఎమ్మెల్యే రామానాయుడిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపైనా కమిటీ సమీక్షించింది. ఆయనకూ నోటీసివ్వాలని తీర్మానించింది.
Read Also… Andhra Pradesh: సముద్రంలో 12 మంది మత్స్యకారులు గల్లంతు.. కాపాడాలంటూ బాధిత కుటుంబాల విజ్ఞప్తి..