AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుద్రంకోటలోని వేల ఏళ్ల చరిత్రకు పోలవరం ముంపు.. చారిత్రక సంపదకు జలసమాధి ప్రమాదం!

ఏదైనా ఒక ప్రాంతానికి ఒక నిర్దిష్టమైన చారిత్రక నేపథ్యం ఉండటం సహజం. కానీ, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 'రుద్రంకోట' మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. రెండు వేర్వేరు కాలఘట్టాలకు చెందిన అరుదైన, అమూల్యమైన చరిత్రను తన గర్భంలో దాచుకున్న విశిష్ట నేల ఇది. ఒకవైపు సింధు నాగరికత కంటే పూర్వపు ఆదిమానవుల జీవన విధానానికి, మరోవైపు కాకతీయ సామ్రాజ్యపు దేదీప్యమాన పాలనా వైభవానికి ఈ గ్రామం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే, శరవేగంగా పూర్తవుతున్న పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో ఈ ప్రాంతం ఉండటంతో, తరతరాల నాటి ఈ సాంస్కృతిక నిధి గోదావరి జలాల్లో శాశ్వతంగా లీనమైపోయే ముప్పు పొంచి ఉంది..

రుద్రంకోటలోని వేల ఏళ్ల చరిత్రకు పోలవరం ముంపు.. చారిత్రక సంపదకు జలసమాధి ప్రమాదం!
Untold Story Of Elurus Rudrankota Village
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 10:52 AM

Share

ఏలూరు, జులై 21: తాజాగా పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఇక్కడ వెలుగుచూసిన భారీ సమాధులు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. మొదట్లో స్థానికులు వీటిని సాధారణ రాతి గుట్టలుగా భావించినా, లోతైన పరిశోధనల్లో అది సింధు నాగరికతకు ముందే విలసిల్లిన మానవ సంస్కృతిగా తేలింది. ఆరు అడుగుల వెడల్పు, పది అడుగుల పొడవుతో నిర్మించిన ఈ సమాధుల్లో లభించిన రంగురంగుల పూసలు, ఇనుప గొడ్డళ్లు, పదునైన కత్తులు, మట్టి పాత్రలు నాటి మానవుల ఆచారాలను స్పష్టం చేస్తున్నాయి. మరణించిన వారికి ఇష్టమైన వస్తువులను వారితో పాటే పాతిపెట్టే సంప్రదాయం ఇక్కడ విరివిగా సాగిదనడానికి ఇవే బలమైన ఆధారాలు. కేవలం జీవించడమే కాకుండా, ఇనుప పనిముట్లు, అలంకరణ సామగ్రిని తయారుచేసే కార్ఖానాలను ఇక్కడే నెలకొల్పి గుజరాత్ వంటి సుదూర ప్రాంతాలకు వర్తకం సాగించినట్లు లభ్యమైన సాక్ష్యాలు చెబుతున్నాయి. ఇది నాటి మానవుల సాంకేతిక నైపుణ్యానికి, వ్యాపార దిట్టతనానికి ప్రత్యక్ష నిదర్శనం.

ఆదిమానవుల యుగం ముగిసిన శతాబ్దాల తర్వాత, కాకతీయుల పాలనలో ఈ ప్రాంతం వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వీరనారి రాణి రుద్రమదేవి వేసవి విడిది కోసం ఇక్కడి గుట్టపై ప్రత్యేకంగా ఒక కోటను నిర్మించుకున్నారు. ఆమె పేరు మీదుగానే కాలక్రమంలో ఈ గ్రామానికి ‘రుద్రంకోట’ అనే పేరు స్థిరపడింది. సైనిక స్థావరాలు, ఆయుధాగారాల ఆనవాళ్లతో పాటు కాకతీయుల అద్భుత శిల్పకళా రీతులను చాటిచెప్పే రాతి స్తంభాలు నేటికీ ఇక్కడ దర్శనమిస్తాయి. శివభక్తురాలైన రుద్రమదేవి ఇక్కడ స్వయంగా ఒక శివాలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్టించారు. కాలక్రమంలో ఈ నిర్మాణాలు మరుగునపడి భూగర్భంలో కలసిపోయినప్పటికీ, 1986లో సంభవించిన గోదావరి భారీ వరదల సమయంలో ఈ ప్రాచీన ఆలయం మళ్లీ బయటపడింది. శివలింగంతో పాటు నంది విగ్రహం లభించడంతో స్థానికులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయాన్ని పునర్నిర్మించి, ధూపదీప నైవేద్యాలను పునరుద్ధరించారు.

ఒకప్పుడు జమీందార్ల వైభవంతో పోటీపడేలా సంపదలతో, కళకళలాడే జీవనంతో విలసిల్లిన రుద్రంకోట, కాలక్రమంలో ఉపాధి అవకాశాలు తగ్గడంతో తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. చాలా కుటుంబాలు వలస వెళ్లగా, మిగిలిన కొద్దిమంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వతో ఈ ప్రాచీన గ్రామం పూర్తిగా మునిగిపోయే సమయం ఆసన్నమైంది. ఈ చారిత్రక సంపద నీటిపాలు కాకముందే ప్రభుత్వం, పురావస్తు శాఖ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడి అరుదైన రాతి స్తంభాలు, శిల్పాలు, విగ్రహాలు మరియు ఆదిమానవుల ఆనవాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించి మ్యూజియంలో భద్రపరచాలని, భావితరాలకు మన గతాన్ని అందించేలా సంరక్షణ చర్యలు చేపట్టాలని చరిత్రకారులు, స్థానికులు కోరుతున్నారు.

Follow Us