Heavy Rains: రెడ్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏపీ వైపు వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని.. తీరానికి సమీపిస్తున్న కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ఇవాళ రాత్రి దక్షిణ ఒరిస్సాలోని గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Heavy Rains: రెడ్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Rain Alert

Updated on: Oct 02, 2025 | 6:16 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏపీ వైపు వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని.. తీరానికి సమీపిస్తున్న కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ఇవాళ రాత్రి దక్షిణ ఒరిస్సాలోని గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరకోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు ఎల్లోఅలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. అన్ని పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

వాయుగుండం ఈ రాత్రికి గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. ఉత్తరకోస్తా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యే చాన్స్‌ ఉందని.. హెచ్చరించింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు.. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్, భీమిలి RDO ఆఫీస్‌లో కంట్రోల్‌ రూమ్‌లు సిద్ధం చేశారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈదురుగాలులు ఒక్కసారిగా విశాఖను చుట్టుముట్టి ఊపేశాయి. పలు చోట్ల చెట్లు కూలి వాహనాలు ధ్వంసం అయ్యాయి. నగరంలో బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు తోడు భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఇక తీవ్ర వాయుగుండం, ఈ రాత్రికి తీరం దాటనున్న నేపథ్యంలో, ఉత్తరాంధ్రకు హై అలర్ట్‌ ప్రకటించింది తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం. రాగల 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..