బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. నిన్న కురిసిన భారీవర్షానికి కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కాలువల నుంచి నేరుగా సముద్రానికి వరద నీరు చేరుతోంది. దీంతో సముద్రం నీటి మట్టం భారీగా పెరిగి స్వల్పంగా ముందుకొచ్చింది. సముద్ర నీటి మట్టం పెరగడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
ఉవ్వెత్తున లేచే కెరటాల ఉధృతికి కొత్తపట్నంనుంచి విద్యుత్ ప్లాంటు వరకు బీచ్రోడ్డు పైకి రాళ్లు ఎగిరి పడుతున్నాయి. మాయాపట్నం గ్రామానికి రక్షణగా నిర్మించిన రివాల్వింగ్ వాల్స్ కూలిపోయే స్దితికి చేరుకున్నాయి, జియో ట్యూబ్స్ కొట్టుకుపోవడంతో కెరటాలు నేరుగా మాయాపట్నం ఊర్లోకి వస్తున్నాయి. దీంతో మత్స్యకారులు గత్యంతరం లేక సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రం ఉధృతంగా ఉండడం సహజమని, ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడన ద్రోణి, భారీ వర్షాలకు మరింత ఉదృతంగా కెరటాలు ఎగసిపడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఉప్పాడ గ్రామాన్ని శాశ్వతంగా కోత నుంచి రక్షించేందకు సమష్టిగా కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీంతో ఉప్పాడ సెంటర్ నుంచి లైట్ హౌస్ మధ్య వాహనాల రాకపోకలు నిషేధించారు పోలీసులు. పిఠాపురం మీదుగా కాకినాడకు వాహనాల మళ్లించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..