Andhra Pradesh: రూ.1.50 లక్షల వరకు వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్.. ఏపీ ప్రభుత్వం భారీ ఊరట.. వారందరికీ బెనిఫిట్..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల రోడ్డు ప్రమాద బాధితులు చికిత్స పొందేందుకు పీఎం రాహత్ పథకాన్ని కొత్తగా ప్రారంభించింది. దీని వల్ల బాధితులు రూ.1.50 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ఈ పథకాన్ని ఏపీలో కూడా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Andhra Pradesh: రూ.1.50 లక్షల వరకు వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్.. ఏపీ ప్రభుత్వం భారీ ఊరట.. వారందరికీ బెనిఫిట్..
Cashless

Updated on: Apr 17, 2026 | 10:14 AM

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారి చికిత్సకు ఆర్ధిక భరోసా కల్పించనుంది. క్షతగాత్రులు తక్షణ వైద్య సాయం పొందేందుకు ఆర్ధికంగా అండగా ఉండనుంది. ఇందుకోసం పీఎం రాహుత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణం వైద్యం పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం రాహత్ స్కీమ్ అమలు చేస్తున్నామన్నారు. దీని వల్ల క్షతగాత్రులు రూ.1.50 లక్షల క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ వెంటనే పొందవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని ఏ హాస్పిటల్‌లో అయినా ఈ సౌకర్యం పొందవచ్చని స్పష్టం చేశారు.

ఏపీలోనే ఎక్కువ మరణాలు

ఈ పథకం అమలుపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అధికారులతో సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో బాధితులకు వెంటనే చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. గాయపడినవారు చికిత్స పొందేందుకు ఆర్దికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పీఎం రాహత్ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన గంటలోనే సత్వరం వైద్య చికిత్స అందించడం వల్ల బాధితులను కాపాడుకోవచ్చన్నారు. దేశవ్యాప్తంగా ఏపీలోని ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, 45 శాతం మరణాలు రాష్ట్రంలోని సంభవిస్తున్నాయని తెలిపారు. మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు గంటలోపే చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తు్న్నామని, అమలు చేసిన తొలి ఏడాదిలోనే 56 శాతం విజయవంతం అయిందన్నారు. 2026 తొలి మూడు నెలల్లో 96 శాతానికి పెరిగిందన్నారు.

14 క్రిటికల్ కేర్ బ్లాకులు

ఇక రాష్ట్రంలో అత్యాధునిక వైద్య చికిత్స కోసం 14 క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేయనున్నట్లు సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. త్వరలోనే వీటిని ప్రారంభించి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇక మరో 10 క్రిటికల్ కేర్ బ్లాకులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, ప్రతీఒక్కరి ప్రాణాలను కాపాడటం తమ బాధ్యత అని అన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎం రాహత్ పథకాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడినవారు దేశంలోని ఏ ఆస్పత్రిలో అయినా రూ.1.50 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ పొందవచ్చు.

Follow Us