Andhra: పాఠశాల విద్యార్థులకు పండగలాంటి వార్త చెప్పిన ఏపీ సర్కార్..

ఏపీ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలు,సంక్షేమ హాస్టళ్లలో రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీ నుంచే దీన్ని అమలు చేయబోతోంది.

Andhra: పాఠశాల విద్యార్థులకు పండగలాంటి వార్త చెప్పిన ఏపీ సర్కార్..
Andhra Students

Updated on: Jun 02, 2025 | 6:17 PM

‘పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింద’ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్  తెలిపారు. జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలోని 41వేల ప్రభుత్వ పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టల్స్‌కు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ఏ రైతు అయితే ఈ బియ్యం పండించారో… ఆయన చేతుల మీదుగానే పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. దేశానికి వెన్నెముక రైతు అని, రైతు లేనిదే రాష్ట్రం లేదని, అటువంటి రైతాంగానికి అండగా నిలబడటం ప్రభుత్వంగా తమ బాధ్యతని తెలిపారు.

మూడు పార్టీల కలయికతో బలంగా ఉన్న మార్కెట్ యార్డ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, భవిష్యత్తులో వీరంతా కలసి, యార్డును మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం కొడాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా  తోట కనకదుర్గ రాజశేఖర్, వైస్ ఛైర్మన్ గాఅత్తలూరి గోపిచంద్, డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఘనంగా జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గౌరవ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “అకాల వర్షాలు, వరస ప్రకృతి విపత్తులతో ఈ ప్రాంత రైతాంగం ఎంతలా నష్టపోయిందో కళ్లారా చూశాం. రోడ్లపై ధాన్యాన్ని రాశులుగా పోసి కన్నీరు కార్చిన సందర్భాలు కోకొల్లలు. అన్నదాతల్లో ధైర్యం నింపడానికి ఆ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాల్లో పర్యటించారు. తక్షణ నష్టపరిహారం రైతులకు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినా వైసీపీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఎంతలా వేధించింది అంటే… వారికి అనుకూలమైన మిల్లులకే ధాన్యం అమ్మాలని రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వందల కిలో మీటర్లు దూరంలో ఉన్నా అక్కడికే వెళ్లి ఇవ్వాలని ఇబ్బందిపెట్టేవారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి నెలలు, సంవత్సరాల తరబడి డబ్బులు చెల్లించేవారు కాదు.

రూ.10 లక్షల కోట్ల అప్పులు

“రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి, కేవలం సంక్షేమం పేరిట గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసింది. దాదాపు రూ.10 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.1674 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్  నిర్ణయం తీసుకోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించాం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయని విధంగా ఖరీఫ్, రబీలో కలిపి దాదాపు 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దానికి సంబంధించి రూ. 12,400 కోట్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ వేశాం. ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మిగిలిన ధాన్యాన్ని కోనసీమ, ఏలూరు నుంచి ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకున్నాం. రైస్ మిల్లులకు రూ. 470 కోట్లు బకాయిలు పెడితే … కూటమి ప్రభుత్వం దూ. 360 కోట్లు చెల్లించి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వారిని భాగస్వాములు చేశాం. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని రైతాంగం ఆందోళన చెందుతుంటే 5 కోట్ల 13 లక్షల గోతాలు ఇచ్చి రైతులను ఆదుకున్నాం. రైతులు ఏ మిల్లుకు అమ్ముకోవాలంటే ఆ మిల్లుకు అమ్ముకునేలా వెసులుబాటు కల్పించాం. వాట్సాప్ ద్వారా ధాన్యాన్ని అమ్ముకునేలా సాంకేతికను తీసుకొచ్చాం” అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

పారదర్శకత కోసమే ప్రజా పంపిణీ వ్యవస్థ

“ఇంటింటికీ రేషన్ పేరిట వైసీపీ ప్రభుత్వం రూ.1650 కోట్లతో 9360 ఎం.డి.యూ. వాహనాలు కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ఈ వాహనాల వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం కలుగలేదు. ఎం.డి.యూ. వాహనాలు ఎప్పుడు ఎక్కడికి వస్తాయో ఎవరికీ సరైనా సమాచారం ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నాం. ప్రతి నెలా 1 నుంచి 15 తేదీలోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్‌ దుకాణాలు తెరిచే ఉంటాయి. ఆదివారాల్లోనూ సరుకులు పంపిణీ చేస్తాం. ఆ సమయంలో ఎప్పుడైనా లబ్ధిదారులు రేషన్‌ తీసుకునే వీలుంటుంది. గతంలో వలే వాహనం కోసం పనులు మానుకుని ఇళ్ల వద్దే ఉండాల్సిన అవసరం లేదు. వీలున్న సమయంలో రేషన్ దుకాణాల దగ్గరకు వెళ్లి సరకులు తెచ్చుకోవచ్చు. దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకు ప్రతి నెలా 5వ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దే అందిచేలా చర్యలు తీసుకున్నాం” అని మంత్రి మనోహర్ వ్యాఖ్యానించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి