AP PRC: మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్న టీచర్లు.. పిల్లల భవిష్యత్ పాడవుతుందన్న సీఎం జగన్

|

Feb 08, 2022 | 2:02 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ(PRC) వివాదం ముగిసిపోలేదా? టీచర్లు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారా? ఇందుకు సంబంధించి ఈ నెల 11న కార్యాచరణ సిద్ధం కానుందా? అంటే అవునని అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.

AP PRC: మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్న టీచర్లు.. పిల్లల  భవిష్యత్  పాడవుతుందన్న సీఎం జగన్
Ap Prc
Follow us on

AP Teachers on PRC: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ(PRC) వివాదం ముగిసిపోలేదా? టీచర్లు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారా? ఇందుకు సంబంధించి ఈ నెల 11న కార్యాచరణ సిద్ధం కానుందా? అంటే అవునని అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ఈ నెల 5న PRC స్టీరింగ్‌ కమిటీతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మె యోచనను విరమించుకున్నాయి ఉద్యోగ సంఘాలు. మరోవైపు, ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఉద్యోగులను ఎర్రజెండా, పచ్చజెండాలు కలిసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని సీఎం జగన్‌(YS Jagan) ఆరోపించారు.

ప్రభుత్వం స్టీరింగ్ కమిటీ సభ్యులు చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్నది ఉపాధ్యాయ సంఘాల ఆరోపణ. దాన్ని త్వరలోనే బయటపెడుతామని అంటున్నాయి. అసలు అంతర్గత ఒప్పందం జరిగిందా? అందులో ఏముంది? నిజంగా అది బయటకు వస్తే సంచలనం కాబోతుందా? అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఫిట్‌మెంట్ మార్చాలని కోరామంటున్న ఉపాధ్యాయ సంఘాలు.. తమ ఆవేదనను సిఎంకు వివరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. 5వ తేదీన జరిగిన చర్చల్లో తమ ఆవేదన చెప్పిన పట్టించుకోలేదని యూటీఎఫ్ సంఘం నేతలు అంటున్నారు.

ఒప్పందాలపై అప్పుడు సంతకాలు చేసి.. ఇప్పుడు ఈ రచ్చ ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాము సమావేశానికి హాజరైనట్లు సైన్ చేశామె తప్పా.. అగ్రిమెంట్‌ మీద కాదని బదులిస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. చర్చలకు హాజరైనట్లు సంతకాలు పెడితే.. అగ్రిమెంట్ ఒప్పుకున్నట్లు ప్రచారం చేస్తున్నాయని ఫ్యాప్టో అంటోంది.మొత్తంగా ఉపాధ్యాయులు మరో పోరుకు సిద్ధం అవుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలావుంటే, ఉపాధ్యాయుల ఆందోళనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కొంతమంది టీచర్లను విపక్ష పార్టీల నేతలు స్వార్థంతో రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇలా అయితే పిల్లల భవిష్యత్ పాడవుతుందన్నారు. ఇప్పటికే కరోనాతో పాఠశాలలు మూత విద్యార్థుల చదువులకు అటంకం కలిగిందన్న సీఎం.. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం.. ఇప్పటికే పాఠశాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చామని, టీచర్లకు మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువస్తామని జగన్ హామీ ఇచ్చారు.

Read Also…  AP High Court: థియేటర్లను సీజ్ చేయడంపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం.. ఆ అధికారం వారికి లేదంటూ..