
వీధి వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. వీళ్లు తమ వ్యాపారం కోసం అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వీరి కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోండగా.. ఇప్పుడు వారికి మరింత చేయూత అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. చాలామంది వీధి వ్యాపారులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే బ్యాంకుల నుంచి గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా, వీధి వ్యాపారులు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా నిలవనుంది. ఇందుకోసం ఎక్కడా చేపట్టని కొత్త కార్యక్రమానికి నాంది పలికింది.
క్రెడిట్ కార్డ్ ఉద్యోగం, వ్యాపారం చేసేవారికి అందిస్తూ ఉంటారు. కానీ వీధి వ్యాపారులకు కూడా క్రెడిట్ కార్డు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. రూ.30 వేల పరిమితితో కూడా కార్డును వారికి బ్యాంకుల ద్వారా ఇవ్వనుంది. తొలుత ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా తిరుపతి జిల్లాలో అమలు చేస్తున్నారు. జిల్లాలో అర్హులైన 7 వేల మంది రైతులకు శుక్రవారం క్రెడిట్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డు ఐదేళ్ల వరకు చెల్లుుబాటు అవుతుంది. దీని వల్ల వీధి వ్యాపారులు 20 నుంచి 50 రోజుల పాటు వడ్డీ లేకుండా డబ్బులు వాడుకోవచ్చు. వ్యాపారులకు అత్యవసరమైన సమయంలో ఇవి చాలా ఉపయోగపడతాయి.
వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అముల చేస్తోంది. ఈ పధకం ద్వారా వ్యాపారులు రూ.50 వరకు లోన్ పొందే అవకాశముంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా ఈ లోన్ అందిస్తున్నారు. మూడు విడతలుగా ఈ రుణాలు అందిస్తున్నారు. తొలుత రూ.10 వేలు మంజూరు చేస్తారు. తిరిగి చెల్లించినవారికి రెండో విడతలో రూ.20 వేలు అందిస్తారు. ఇది సక్రమంగా చెల్లించినవారికి మూడో విడతలో ఏకంగా రూ.50 వేల వరకు రుణం అందిస్తున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే 7 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నారు. దీంతో పాటు రుణం చెల్లించినవారికి క్రెడిట్ కార్డులు అందిస్తున్నారు. తొలుత తిరుపతి జిల్లాల్లోని వీధి వ్యాపారులకు ఇస్తుండగా.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీని వల్ల వీధి వ్యాపారులకు ఆర్ధిక తోడ్పాటు అందించినట్లు అవుతుంది. అలాగే వారి వ్యాపారానికి ఇబ్బందులు లేకుండా డబ్బులు అందించినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు.