
ఏపీలోని రైతులకు కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో చాలామంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఈ దరఖాస్తులు ఎప్పటినుంచో ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. దీంతో విద్యుత్ కనెక్షన్లు ఎప్పుడు మంజూరు అవుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. దరఖాస్తు చేసుకున్నవారికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తుండగా.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ కనెక్షన్ కోసం 46,113 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ రైతులు ఇప్పుడు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం అవసరమైన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామాగ్రిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. మూడు డిస్కంల పరిధిలో ఈ పనులను త్వరలో చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.250 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది. త్వరలో డిస్కంలకు ప్రభుత్వం నుంచి ఆ నిధులు అందనున్నాయి. అనంతరం విద్యుత్ శాఖ రైతులకు విద్యుత్ కనెక్షన్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనుంది. రెండు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. వీటికి 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు అవసరం. ఒక్కొ కనెక్షన్కు రూ.50 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
తాజాగా మంజూరు చేసిన కనెక్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 22.30 లక్షలకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా మరికొన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. విడతల వారీగా వాటికి కూడా అనుమతి ఇవ్వనున్నారు. సాధారణంగా దరఖాస్తు చేసుకున్న రెండు నెలలకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అసిస్టెంట్ ఇంజనీర్ల కొరత వల్ల జాప్యం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 50 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఇప్పుడు క్లియర్ చేశారు. ఇక 2025 జనవరి నుంచి కొత్త కనెక్షన్ల కోసం మరికొన్ని దరఖాస్తులు వచ్చాయి. వీటికి కూడా త్వరలోనే అనుమతులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీలైనంత త్వరగా రైతులకు వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.