Elections Commission: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా ఇదే చివరి రోజు.. కీలక వ్యాఖ్యలు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్..

|

Mar 31, 2021 | 2:33 PM

Elections Commission: ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణ అంశంలో..

Elections Commission: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా ఇదే చివరి రోజు.. కీలక వ్యాఖ్యలు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్..
Nimmagadda Ramesh
Follow us on

Elections Commission: ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణ అంశంలో పూర్తి సంతృప్తిగా ఉన్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం ఇవాళ్టితో ముగిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తాను పదవిలో ఉన్నంత కాలం తీసుకున్న నిర్ణయాలు, ఉద్యోగుల సహకారం, ప్రభుత్వ సహకారం, మీడియా సహకారంపై మాట్లాడారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమన్నారో ఆయన మాటల్లోనే యధాతథంగా.. ‘ఎన్నికల కమిషనర్‌గా పదవి బాధ్యతలు ముగుస్తుంది. మీడియా సహకారం మరువలేనిది. ఎన్నికలు సజావుగా జరిగాయి. నేను పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు రీ పోలింగ్ లేకుండా జరగడం అభినందనీయం. ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతోనే ఇది సాధ్యం అయ్యింది. కలెక్టర్లు, ఎస్పీలు అద్భుత పనితీరు కనబరిచారు. ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం లభించింది. సిబ్బంది, నిధులు సమకూర్చారు. సీఎస్, డీజీపీకి నా కృతజ్ఞతలు.’

‘వ్యక్తులు చేసే అనాలోచిత చర్యల వలన.. వ్యవస్థల మధ్య అగాధం ఏర్పడుతుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికల సిబ్బంది కొందరు సెలవులో వెళ్ళాలని అనుకున్నారు. వారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాము. నా ఓటు స్వగ్రామంలో లేదు.. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు.
పదవీ విరమణ తరవాత నా హక్కుల సాధన కోసం న్యాయ పోరాటం చేస్తాను. పంచాయతీ ఎన్నికల సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల కమిషన్‌గా మీకున్న అధికారాలతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. ఎన్నికల కమిషన్ పరిధి దాటి వ్యవహరించలేదు.

‘చట్ట సభల్ని గౌరవించాల్సిందే.. గవర్నర్ సెక్రటరీగా పని చేసినపుడు.. నాకు వ్యవస్థలపై పూర్తి అవగాహన ఉంది. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ విషయంలో న్యాయం చేయాలని కొన్ని చర్యలు తీసుకున్నాము. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా నిబంధనలు ఉన్నాయి. అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకొని ఎన్నికల సంస్కరణలపై ఒక నివేదిక తయారు చేసాను. త్వరలో గవర్నర్‌కి అందిస్తాను. ఎన్నికల సంఘం నూతన కార్యదర్శిగా నీలం సాహ్ని నియామకాన్ని స్వాగతిస్తున్నాను. వారికి నా అభినందనలు.’

‘నేను ఏ లేఖలు రాసినా బహిర్గతం చేయలేదు. అధికారిక విషయాలు బయటకు వెల్లడించను. హైకోర్టులో అనేక విషయాల్లో ఎన్నికల కమిషన్ విజయం సాధించింది. 243 అధికరణం ప్రకారం ఎన్నికల కమిషన్‌కు అధికారాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం నుంచి కోరుకున్న విధంగా తోడ్పాటు, సహకారం లభించింది’ అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు.

Also read:

Kurnool District Collector Office: టెన్త్ క్వాలిఫికేషన్ తో కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగవకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!

Rafale Fighter Jet: భారత్‌కు మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు.. మరింత పటిష్టం కానున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..