Jagananna colonies : ఇళ్లు లేని వారు ఎక్కడా ఉండకూడదు.. పండగ వాతావరణంలో నిర్మాణాలకు పునాదులు వేస్తున్నాం : జగన్

దేశ చరిత్రలోనే ప్రథమంగా.. కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైయస్..

Jagananna colonies : ఇళ్లు లేని వారు ఎక్కడా ఉండకూడదు.. పండగ వాతావరణంలో నిర్మాణాలకు పునాదులు వేస్తున్నాం : జగన్
Cm Jagan

Updated on: Jun 03, 2021 | 1:15 PM

YSR-Jagananna Colonies : దేశ చరిత్రలోనే ప్రథమంగా.. కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదన్న సత్సంకల్పంతో పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి ఇవాళ పునాదులు వేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం పై విధంగా వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక ఘట్టం ఇదని ముఖ్యమంత్రి చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుందన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

ఇలా ఉండగా, ఆంధప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తోన్నవైయ‌స్ఆర్ – జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కాగా, అన్ని వసతులతో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, రాళ్లు, సిమెంటు, ఇటుకలు, విద్యుత్‌ సప్లై, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, నీటి వసతులను కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రచించి డీపీఆర్‌ లు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సూచించారు.

ప్రతి లేఅవుట్‌ కు సంబంధించిన సమగ్ర వివరాలను సమకూర్చుకోవాలని.. ఇవాళ్టి నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి డిసెంబర్‌ నాటికి మొదటి దశ ఇళ్ల నిర్మాణం పనులు పూర్తిచేయాలని అందుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పన కార్యక్రమాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించారు. జగనన్న కాలనీల్లో అంతర్గత రోడ్డు, కరెంటు, తాగునీరు అంగన్వాడీ కేంద్రాలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తోపాటు అన్ని మౌలిక వసతులు కల్పించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంలో చురుకైన పాత్ర పోషించాలని అధికారులను ఆదేశించారు.

Read also : Beggar murder : హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు యాచకుల మధ్య గొడవ.. ఒకరు మ‌ృతి