Andhra Pradesh: ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క లిక్కర్ బాటిల్ తెచ్చేందుకు కూడా అనుమతి లేదు.. ఏపీ సర్కార్ క్లారిటీ

|

Aug 12, 2021 | 5:40 PM

మద్యం అమ్మకాలు, అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయాలు కొందరి పాలిట శాపంగా...

Andhra Pradesh: ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క లిక్కర్ బాటిల్ తెచ్చేందుకు కూడా అనుమతి లేదు.. ఏపీ సర్కార్ క్లారిటీ
Illegal Liquor
Follow us on

మద్యం అమ్మకాలు, అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ నిర్ణయాలు కొందరి పాలిట శాపంగా మారుతున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన వారిపై ఏపీ పోలీసులు సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటున్నారు. నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు కొందరిపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు డిమాండ్‌ చేస్తూ వేధించడంతో బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకచోట బాధితుడు ఆత్మహత్య చేసుకోగా, మరోచోట ఎక్సైజ్‌ పోలీసులు దాడి చేయడం వల్లే బాధితుడు చనిపోయాడనే ఆరోపణలున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఏపీకి లిక్కర్‌ తీసుకురావడానికి మూడు బాటిళ్లకు అనుమతి ఉండేది. అయితే అక్రమ మద్యం కేసును ఎదుర్కొన్న ఓ వ్యక్తి హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మూడు బాటిళ్లకు అనుమతి ఉన్నా అక్రమ మద్యం కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. దీంతో అప్పటి నుంచి గతంలో ఉన్న పాత జీవోను సవరించింది ఏపీ ప్రభుత్వం.

గతంలో మూడు బాటిళ్ల వరకు అనుమతి ఉన్నా, కొందరు దాన్ని దుర్వినియోగం చేశారని, అందుకే ఏపీ ప్రభుత్వం పాత జీవోలో సవరణలు చేసిందని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఒక్క బాటిల్‌ కూడా తీసుకు రావడానికి వీల్లేదని చెబుతున్నారు. ముందస్తు అనుమతి తీసుకుని, పన్నులు చెల్లించి తర్వాత మాత్రమే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి రెండు లీటర్ల మద్యం తీసుకు రావడానికి అనుమతి ఉందంటున్నారు ఎక్సైజ్‌ అధికారులు.

ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలతో కొత్త జీవోపై వివాదం మొదలైంది. ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా కొంత సడలింపు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క బాటిల్‌కు కూడా అనుమతి లేకపోవడంతో చాలా మందిపై కేసులు నమోదవుతున్నాయని, దీని సాకుతో ఇదే అదనుగా పోలీసుల వేధింపులు కూడా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించడంతో పాటు బాధితులను వేధిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లిక్కర్‌ సరఫరా విషయంలో పాత జీవోనే కొనసాగించాలనే డిమాండ్‌ కూడా వినిపిస్తోంది.

Also Read: ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్‌పై ట్విస్ట్.. హైకోర్టుకు వెళ్లిన వ్యవహారం

హైదరాబాదీలు బీ అలెర్ట్… కాలకూట విషంగా మారిన భాగ్యనగరం మట్టి