
నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో నిషేధిత జాబితా 22-Aలో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.గతంలో భూముల రీ-సర్వే నిర్వహించగా.. అర్హత ఉన్న భూములను కూడా 22-A జాబితాలో చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ప్రైవేట్ భూములను 22-A జాబితా నుంచి పూర్తిగా తొలగించనున్నారు. 5 రకాల భూములను 22-A జాబితా నుంచి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములు స్వాతంత్ర్య సమరయోధుల భూములను 22-A నుంచి తొలగించారు. మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలో GOMలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని చెప్పారు .
సెక్షన్ 22A అనేది ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం. 1908 కింద ప్రభుత్వ విధానానికి విరుద్ధమని ప్రకటించబడిన కొన్ని రకాల భూముల రిజిస్ట్రేషన్ను నిషేధించే నిబంధన. దీనిని నిషేధిత జాబితా అని పిలుస్తారు. 22Aలో ఉన్న భూములపై ఎలాంటి లావాదేవీలు చేయలేరు, రిజిస్టర్ కూడా చేయలేరు. సెక్షన్ 22A ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములతో పాటు ఇతర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్న భూములను రక్షించడానికి ఉద్దేశించబడింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 22A జాబితాలో ఉన్న ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాల్సి ఉంటుంది. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదోకటి సరిపోతుందని.. 8ఏ రిజిస్టర్లు, డికెటీ పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా ఒకటే అని తెలియజేసింది. దాదాపు 8 రకాల ప్రతాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22ఏ నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇంకా అదనంగా పత్రాలు కావాలని భూ యాజమానులను తిప్పుకోకూడదని మంత్రి అనగాని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..