కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదని.. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కరోనా సోకితే అంటరానితనం, ఒక భయంకరమైన రోగమనే భావనను అందరూ తీసేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ సోకిన వారిపట్ల వివక్ష చూపించకుండా అందరిలో సామాజిక స్పృహను తీసుకురావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో కరోనా అందరికీ సహజంగా సోకే అవకాశం ఉండొచ్చని ఆయన అన్నారు. అలాంటి వాళ్లే 80 శాతం మంది ఉన్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయని జగన్ చెప్పారు. కొందరికి ఇది ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుందని జగన్ తెలిపారు.
కరోనా జ్వరం లాంటిదేనని ఎవరికైనా రావొచ్చని ఈ సందర్భంగా జగన్ అన్నారు. రేపు పొద్దున తనకైనా కరోనా రావొచ్చని ఆయన చెప్పారు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా త్వరగా నయమవుతుందని జగన్ తెలిపారు. అయితే ఇంట్లో పెద్దవాళ్లను కాపాడుకునే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే 104, 108కు వెంటనే సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మంచి ఆరోగ్యం తీసుకొని రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని.. అదే కరోనాకు పరిష్కారమని జగన్ చెప్పుకొచ్చారు.
Read This Story Also: Corona Updates: ఏపీలో పెరిగిన కేసులు.. తెలంగాణలో తగ్గుముఖం..!