
ఏపీలో ఆక్వా రంగ పురోగతికి మరో కీలక అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన ఆక్వా హబ్గా నిలబెట్టే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే రొయ్యల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రానికి ఇది మరో పెద్ద బలం అవుతుందనే అంచనా ఉంది. దేశంలో ఆక్వాకల్చర్ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం ఉత్పత్తిలో దాదాపు సగం వాటా రాష్ట్రం నుంచే వస్తోంది. ఇలాంటి సమయంలో NFDB ప్రాంతీయ కార్యాలయం రావడం వల్ల పాలసీలు, ప్రాజెక్టులు, నిధులు రాష్ట్రానికి మేలు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఢిల్లీ లేదా ఇతర కేంద్రాలపై ఆధారపడాల్సి వచ్చేది, ఇప్పుడు అదే వ్యవస్థ అమరావతిలో అందుబాటులోకి వస్తోంది.
NFDB కార్యాలయం ఏర్పాటుతో మత్స్యకారులు, చెరువుల యజమానులకు నేరుగా లాభం ఉంటుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY), NFDB స్కీముల కింద చెరువు నిర్మాణం, ఆధునిక పరికరాలు, ఫీడ్, సీడ్ సపోర్ట్ వంటి సబ్సిడీలు సులభంగా అందుతాయి.
అప్లికేషన్ నుంచి అనుమతుల వరకు ప్రక్రియ వేగవంతం అవుతుంది. ట్రైనింగ్, టెక్నికల్ సపోర్ట్ కూడా స్థానికంగానే లభించే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశానికి ఆక్వా హబ్గా ఆంధ్రప్రదేశ్ స్థానం మరింత బలపడేలా ఈ నిర్ణయం పనిచేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎగుమతులు పెరగడం, నాణ్యత మెరుగవడం, రైతుల ఆదాయం పెరగడం వంటి ప్రయోజనాలు కనిపించనున్నాయి.
అమరావతిలో NFDB కార్యాలయం ఏర్పాటు ఏపీ రాష్ట్ర మత్స్య రంగానికి దీర్ఘకాలికంగా గేమ్ ఛేంజర్గా మారే అవకాశాలు ఉన్నాయన్నారు రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. దీంతో రైతులకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..